న్యూ ఇయర్ వేడుకలు మందుబాబులకు కిక్కిచ్చినా, పోలీసులకు మాత్రం తలనొప్పిగా మారాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం మత్తులో ఉన్న పలువురు యువకులు పోలీసులతో వాగ్వాదాలకు దిగారు. మద్యం సేవించి రోడ్లపై హంగామా చేయడం, పోలీసుల మాట వినకుండా లొల్లి పెట్టడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
Read also: Hyderabad: న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్ హెచ్చరికలు
డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు పోలీసులు ముందుగానే అప్రమత్తమయ్యారు. న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, రాత్రి నుంచి ఉదయం వరకు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే భారీ జరిమానాలు, కేసులు తప్పవని పోలీసులు హెచ్చరించినప్పటికీ, చాలామంది ఆ హెచ్చరికలను పట్టించుకోలేదు. ఫలితంగా ఒకే కమిషనరేట్ పరిధిలో 1198 మంది డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డారు. ప్రతి వాహనాన్ని ఆపి బ్రీత్ అనలైజర్ ద్వారా పరీక్షలు నిర్వహించారు.
హయత్నగర్ పరిధిలో జరిగిన ఘటన మరింత చర్చనీయాంశంగా మారింది. మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడిని పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్లో పట్టుకున్నారు. అతని బైక్ను సీజ్ చేసిన పోలీసులు, ఇంటికి వెళ్లేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. అయితే ర్యాపిడో బుక్ కావడం లేదని చెబుతూ, పోలీసులే తనను ఇంటికి డ్రాప్ చేయాలని డిమాండ్ చేస్తూ వాగ్వాదానికి దిగాడు. పోలీసులు ఎంతగా సముదాయించినా అతను తగ్గలేదు. మరోవైపు వనస్థలిపురంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల సమయంలో ఓ వ్యక్తి రోడ్డుపై పడుకుని హంగామా చేశాడు. పోలీసులు తనపై చేయి చేసుకున్నారని ఆరోపిస్తూ గొడవకు దిగాడు. ట్రాఫిక్ పోలీసులు ఈ ఆరోపణలను ఖండించి సివిల్ పోలీసులకు సమాచారం అందించగా, వారు వచ్చేలోపే ఆ వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: