ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన అందాల పోటీలలో ఒకటైన మిస్ వరల్డ్ 2025 ప్రస్తుతం హైదరాబాద్లో అట్టహాసంగా జరుగుతున్నాయి. ఇది 72వ మిస్ వరల్డ్ (Miss World) ఎడిషన్ కావడం విశేషం. ఈ ఏడాది పోటీలకు 110 దేశాల నుంచి అందాల భామలు పాల్గొంటుండగా, భారత్ తరఫున మిస్ ఇండియా మిస్ ఇండియా నందిని గుప్తా పోటీలో ఉన్నారు.

ఈ అందాల పోటీ కార్యక్రమాల్లో భాగంగా, పాల్గొననున్న దేశాల సుందరీమణులు తెలంగాణ సంస్కృతి, వారసత్వం, చారిత్రక ప్రాశస్త్యాన్ని అనుభవించేందుకు ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా మిస్ వరల్డ్ సభ్యులు హైదరాబాద్ చిహ్నంగా నిలిచిన చార్మినార్, చౌమొహల్లా ప్యాలెస్ వంటి ప్రసిద్ధ ప్రదేశాలను సందర్శించనున్నారు. ఈ సందర్శనల్లో భాగంగా నేడు వారు చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్ (heritage walk), అనంతరం చౌమొహల్లా ప్యాలెస్లో విందులో పాల్గొననున్నారు.
ట్రాఫిక్ నియంత్రణపై హైదరాబాద్ పోలీసుల చర్యలు
ఈ అంతర్జాతీయ స్థాయి ఈవెంట్ సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రజల రద్దీని నియంత్రించేందుకు మరియు అందాల భామల భద్రత దృష్ట్యా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. మే 13, మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ముఖ్యంగా చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ను పూర్తిగా నిరోధించారు.

బంద్ చేసిన రహదారులు
పలు మార్గాల్లో దారి మళ్లించారు. మదీనా నుంచి చార్మినార్ వైపు, చార్మినార్ నుంచి శాలిబండ వైపు.. శాలిబండ నుంచి వొల్గా జంక్షన్ వరకు, వొల్గా జంక్షన్ నుంచి మూసబౌలీ మీదుగా ఖిల్వత్ రోడ్డు వరకు అన్ని రకాల వాహనాల రాకపోకల ఎంట్రీ క్లోజ్ చేశారు. దారి మళ్లించిన మార్గాలు ఏవంటే నయాపూల్ నుండి చార్మినార్ వైపు వచ్చే వాహనాలను మదీనా జంక్షన్ నుండి సిటీ కాలేజీ వైపు మళ్లించారు. హిమ్మత్ పురా వైపు నుండి వచ్చే వాహనాలను చౌమొహల్లా ప్యాలెస్ వైపు కాకుండా వొల్గా జంక్షన్ నుంచి ఫతే దర్వాజ వైపు పంపిస్తారు. అలాగే ఫతే దర్వాజ నుండి వచ్చే వాహనాలను వొల్గా జంక్షన్ నుంచి మళ్లిస్తారు. పూరానాపూల్, గుడ్ విల్ కేఫ్ నుంచి వచ్చే వాహనాలను చార్మినార్, చౌమొహల్లా ప్యాలెస్ వైపు అనుమతించరు. అలానే పలు మార్గాలను మళ్లించినట్టు ప్రకటించారు.
ప్రజలకు ట్రాఫిక్ శాఖ సూచనలు:
హైదరాబాద్ నగర ప్రజలు, ప్రయాణికులు ఈ ఆంక్షలను గౌరవించి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. అత్యవసర అవసరాల కోసం ట్రాఫిక్ హెల్ప్లైన్ నంబర్ 9010203626 ద్వారా సంప్రదించవచ్చని ట్రాఫిక్ శాఖ పేర్కొంది.