రంగుల పండుగ అయిన హోలీని దేశవ్యాప్తంగా ఎంతో వైభవంగా జరుపుకుంటారు. హోలీ పండగ అంటే చాలు ప్రతి ఒక్కరి మనసులో ఆనందం ఉత్సాహం కలుగుతుంది. హోలీ రోజున శత్రువులు కూడా మిత్రులు అవుతారని పెద్దలు చెబుతారు. ఒకవైపు భారతదేశంలోని ప్రతి ఒక్కరూ హోలీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటే.. అదే సమయంలో దేశంలోని కొన్ని ప్రదేశాలలో హోలీ పండుగ వస్తుందనే ఉత్సాహం కనిపించదు. భారతదేశంలోని ఈ ప్రదేశాలలో హోలీ జరుపుకోకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. మార్చి 14, 2025న, దేశం మొత్తం హోలీ పండుగను జరుపుకోనుండగా.. కొన్ని ప్రదేశాలలో హోలీ రంగులు అస్సలు కనిపించవు.

ఉత్తరాఖండ్లోని రెండు గ్రామాలు హోలీకి దూరం
మన దేశంలో దేవ భూమి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ జిల్లాలో ఖుర్జన్, క్విల్లి అనే రెండు గ్రామాలు ఉన్నాయి. ఈ రెండు గ్రామాల్లో దాదాపు 150 సంవత్సరాలుగా హోలీ పండగను జరుపుకోరు. ఈ గ్రామాల ప్రజలు తమ వంశ దేవతకు శబ్దం, సందడి అంటే ఇష్టం ఉండదని నమ్ముతారు. దీంతో ఈ గ్రామంలో హోలీ పండుగ జరుపుకుంటే.. తమ దేవత గ్రామంపై అగ్రహిస్తుందని గ్రామంలో అనుకోని విషాదం సంభవించవచ్చని నమ్మకం.
గుజరాత్లోని రామ్సాన్ లో హోలీ సందడి వుండదు
గుజరాత్ రాష్ట్రంలోని రామ్సాన్ అనే ప్రదేశంలో 200 సంవత్సరాలకు పైగా హోలీ జరుపుకోలేదు. ఈ గ్రామ ప్రజలు శ్రీరాముడు వన వాస సమయంలో తమ ప్రదేశాన్ని సందర్శించాడని నమ్ముతారు, అందుకే ఈ ప్రాంతానికి రామ్సాన్ అని పేరు వచ్చింది. సాధారణంగా ఈ గ్రామాన్ని రామేశ్వర్ అని కూడా పిలుస్తారు. ఈ ప్రాంత ప్రజలు హోలీ జరుపుకోకపోవడానికి రెండు కారణాలు చెబుతారు. మొదటి కారణం ఏమిటంటే 200 సంవత్సరాల క్రితం హోలిక దహన్ సమయంలో ఈ గ్రామంలో అగ్నిప్రమాదం జరిగి అనేక ఇళ్ళు దగ్ధం అయ్యాయి. ఈ గ్రామంలో హోలికను దహనం చేస్తే గ్రామం మొత్తం అగ్నికి ఆహుతవుతుందని శపించారని నమ్ముతారు.
జార్ఖండ్లోని ఈ ప్రదేశంలో హోలీ లేదు
జార్ఖండ్లోని దుర్గాపూర్ అనే గ్రామంలో దాదాపు 100 సంవత్సరాల నుంచి హోలీ పండగను జరుపుకోవడం లేదు. గ్రామాన్ని ఏలే రాజు కుమారుడు హోలీ రోజున మరణించాడని.. తర్వాత సంవత్సరం ఆ దేశ రాజు కూడా హోలీ రోజున మరణించాడని నమ్ముతారు. రాజు తుది శ్వాస విడిచే ముందు ఈ గ్రామంలో హోలీ జరుపుకోవద్దని గ్రామ ప్రజలకు చెప్పాడట. అప్పటి నుంచి ఈ గ్రామ ప్రజలు హోలీ పండగకు దూరంగా ఉంటారట.