పిల్లల ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులు తీసుకునే జాగ్రత్తలు కొన్నిసార్లు ప్రతికూల ఫలితాలనిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పిల్లల పాదాలకు నిరంతరం సాక్సులు, షూలు తొడగడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చని, బదులుగా వారు చెప్పులు లేకుండా నేలపై, పచ్చటి గడ్డిపై నడవడం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరతాయని సూచిస్తున్నారు. ఈ పద్ధతి పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎలా దోహదపడుతుందో వివరంగా తెలుసుకుందాం.

కళ్ల ఆరోగ్యానికి చెప్పుల్లేని నడక
నేటి కాలంలో చిన్న వయసులోనే పిల్లలకు కళ్లద్దాలు రావడం సర్వసాధారణమైపోయింది. దీనికి గాడ్జెట్ల వాడకం, పోషకాహార లోపం ప్రధాన కారణాలైనప్పటికీ, పిల్లలు నడిచే విధానం కూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. పిల్లలు నడక ప్రారంభించినప్పటి నుంచే వారిని చెప్పుల్లేకుండా నేలపై, ముఖ్యంగా పచ్చటి గడ్డిపై నడిపించడం వల్ల కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని పేర్కొంటున్నారు.

కంటికి అనుసంధానమైన పలు ప్రెస్సింగ్ పాయింట్స్ పాదాల్లో ఉంటాయని, చెప్పుల్లేకుండా నడవడం వల్ల వాటిపై ఒత్తిడి పడుతుందని, తద్వారా కళ్లకు సరైన రక్తప్రసరణ జరిగి కంటి ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు వివరిస్తున్నారు. అంతేకాకుండా, పచ్చటి గడ్డిని చూడడం వల్ల కంటిలోని కండరాలు రిలాక్స్ అవుతాయి. ఈ అలవాటును పెద్దయ్యాక కూడా కొనసాగించడం వల్ల కంటి సంబంధిత సమస్యలు దరిచేరకుండా జాగ్రత్తపడవచ్చు. ఈ విధమైన నడక రక్తపోటు, హృదయ స్పందన రేటు, చర్మం, కండరాల ఉద్రిక్తతపై కూడా సానుకూల ప్రభావాలను చూపుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
మెదడు చురుకుదనం, జ్ఞాపకశక్తి మెరుగుదల
కొన్ని అధ్యయనాలు ప్రకారం, చిన్న వయసులో చెప్పులు వేసుకొని తిరిగిన పిల్లలతో పోల్చితే, చెప్పుల్లేకుండా నడిచిన పిల్లల్లో మెదడు మరింత చురుకుగా పనిచేస్తుందని తేలింది. మెదడుతో అనుసంధానమై ఉన్న ప్రెజర్ పాయింట్స్పై ఒత్తిడి పడటం వల్ల మెదడులోని నాడులు ఉత్తేజితమవుతాయి. ఫలితంగా వారి ఆలోచనా సామర్థ్యం, జ్ఞాపకశక్తి వంటివి గణనీయంగా మెరుగుపడతాయి. అందుకే పిల్లలను చెప్పుల్లేకుండా నడిపించమని నిపుణులు సలహా ఇస్తున్నారు.

మానసిక ప్రశాంతత, సుఖ నిద్ర
రోజుకు కొంతసేపు పచ్చటి గడ్డిలో ఆడించడం, చెప్పుల్లేకుండా తిప్పడం వంటివి చేయడం వల్ల శరీరంలో “హ్యాపీ హార్మోన్లు”గా పిలిచే ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. తద్వారా మనసులోని టెన్షన్లు తగ్గి, మానసిక ప్రశాంతత సొంతమవుతుంది. చెప్పుల్లేకుండా నడవడం వల్ల అభిజ్ఞా వేగం, ఏకాగ్రతలో గణనీయమైన పెరుగుదల, మెదడు ఒత్తిడిలో తగ్గుదల కూడా ఉన్నాయని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.

చాలామంది పిల్లలు నిద్రపోవడానికి సమయం తీసుకుంటారు, ముఖ్యంగా పాఠశాల ఉన్న రోజులు, సెలవు రోజుల్లో వారి నిద్ర సమయాలు మారుతూ ఉంటాయి. ఈ పరిస్థితి వారి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని, మెదడు ఎదుగుదలపై కూడా ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సమస్యను అధిగమించడానికి, రోజూ కాసేపు చెప్పుల్లేకుండా నేలపై, పచ్చటి గడ్డిపై నడిపించడం మంచిదని సూచిస్తున్నారు. ఈ ప్రక్రియ వల్ల శరీరంలోని హార్మోన్లు సమతుల్యం అవుతాయని, తద్వారా ప్రశాంతంగా నిద్ర పట్టడంతో పాటు ఇతర అనారోగ్యాల బారిన పడకుండా జాగ్రత్తపడవచ్చు.
ప్రతికూల ఆలోచనల నివారణ
పెద్దవారిలోనే కాదు, చిన్నపిల్లల్లోనూ ప్రతికూల ఆలోచనలు వస్తుంటాయి. పెద్దయ్యే క్రమంలో అవి వారిని మరింత ప్రతికూల దృక్పథంలోకి నెట్టేస్తాయి. అటువంటి ప్రతికూల ఆలోచనలు దరిచేరకుండా, చిన్నతనం నుంచే వారిలో సానుకూల దృక్పథాన్ని నింపాలంటే రోజూ కాసేపు చెప్పుల్లేకుండా నేలపై నడిపించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల భూమిలోని పాజిటివ్ ఎలక్ట్రాన్లు శరీరంలోకి ప్రవేశిస్తాయని, అదే సమయంలో శరీరంలోని నెగెటివ్ ఎలక్ట్రాన్లను భూమి గ్రహిస్తుందని, దీనివల్ల ప్రతి విషయంలోనూ సానుకూలంగా ఆలోచించే శక్తి వారిలో పెరుగుతుందని, మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని పేర్కొన్నారు.
పిల్లలు చెప్పుల్లేకుండా నడవడం, ఆడుకోవడం ఆరోగ్యపరంగా, మానసికంగా మంచిదే అయినప్పటికీ, అలా నడిచే సమయంలో వారిని నిరంతరం గమనిస్తూ ఉండాలని నిపుణులు తల్లిదండ్రులకు సూచిస్తున్నారు.
Read also: Aloe vera: అలోవెరా లో అరవై ఔషధ గుణాలు