Hyderabad: హైదరాబాద్ నగరంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఎవరినైనా నమ్మితే నట్టేట ముంచేసి వెళ్తున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 25లోని ప్లాట్ నంబర్ 305లో అనిరుధ్ రెడ్డి అనే బిజినెస్మెన్ తన భార్య దీపికా రెడ్డితో కలిసి నివాసం ఉంటున్నాడు. దీపికా రెడ్డి హైదరాబాద్లోని ఓ ఫేమస్ హోటల్ ఓనర్ కుమార్తె కావడం గమనార్హం. ఇక వీరు ఇంటికి తాళం వేసి.. సరదాగా ఊటీ ట్రిప్కు వెళ్లారు. అయితే వీరి ఇంట్లో పనిచేసేందుకు 45 రోజుల క్రితమే ఓ నేపాలీ జంట వచ్చింది. నేపాల్కు చెందిన మహేష్ సాహి, అప్సర సాహి ఇద్దరు.. కొన్ని రోజుల క్రితం అనిరుధ్ రెడ్డి ఇంట్లో పనిచేస్తూ.. కాస్త నమ్మకంగానే ఉన్నారు.
పక్కా ప్లాన్తోనే చోరీ
పక్కా ప్లాన్ ప్రకారం ఇంట్లో పనికి చేరిన మహేష్ సాహి, అప్సర సాహి.. అవకాశం కోసం వేచి చూడగా.. సరిగ్గా అదే సమయంలో అనిరుధ్ రెడ్డి, దీపికా రెడ్డి జంట.. టూర్కు వెళ్లారు. దీంతో ఇదే అదునుగా భావించిన నేపాలీ జంట.. ఇంట్లోకి ఎలా చేరుకోవాలి.. నగలు, డబ్బు ఎక్కడ దాచి పెట్టారు అనే దానిపై రెక్కీ నిర్వహించి.. పక్కా ప్లాన్ వేశారు. అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో రాడ్లు, కత్తుల సాయంతో ముందుగా మెయిన్ డోర్ తాళాలు పగులగొట్టారు. ఆ తర్వాత బెడ్రూమ్లోకి వెళ్లి.. తెల్లవారుజామున 4.30 గంటల వరకు అల్మారా, లాకర్లు పగులగొట్టారు. అందులో ఉన్న 8 డైమండ్ నెక్లెస్లు, 10 రోలెక్స్ వాచీలు, బంగారు నగలను తమ వెంట తెచ్చుకున్న బ్యాగ్లో సర్దుకుని అక్కడి నుంచి పరారయ్యారు.
ఇంటికి వచ్చిన డ్రైవర్ డోర్, లాకర్లు పగలగొట్టి ఉండటాన్ని గమనించి దొంగతనం జరిగిందని గుర్తించాడు. వెంటనే తమ యజమానికి ఫోన్ చేసి సమాచారం ఇవ్వగా వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించారు. డోర్లు, అల్మారా, లాకర్లపై ఉన్న వేలిముద్రలను సేకరించారు. ఈ నేపాలీ దంపతులను పనిలో చేర్పించిన పాత పనిమనుషులు హరత్ సింగ్, రీమాసింగ్లు ఎక్కడ ఉన్నారో గాలింపు చేపట్టారు
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: