హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) భూముల ప్రైవేటీకరణ పై మళ్లీ పెద్ద దుమారం రేగింది. ప్రభుత్వం ఈ భూములను ప్రైవేటు సంస్థలకు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఆదివారం ఉగాది పండుగ సందర్భంగా క్యాంపస్లో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి, జెసిబిలతో భూములను చదును చేయడానికి ప్రయత్నించడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

విద్యార్థుల నిరసన – పోలీసుల అరెస్టులు
విద్యార్థులు ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. పోలీసులు క్యాంపస్లోకి ప్రవేశించి భూములను చదును చేయడానికి ప్రయత్నించగా, వందల సంఖ్యలో విద్యార్థులు జెసిబిలకు అడ్డుగా నిలిచారు. విద్యార్థుల నిరసన క్రమంగా ఉధృతమవుతుండగా, పోలీసులు బలప్రయోగానికి దిగారు. పోలీసులు 52 మంది విద్యార్థులను అరెస్ట్ చేసి, మాదాపూర్, కొల్లూరు, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక ప్రకారం, ఉగాది పండుగ రోజు క్యాంపస్లోని 400 ఎకరాల భూమిని ప్రైవేటీకరించేందుకు ముమ్మరంగా పని ప్రారంభించింది. ఆదివారం సెలవుదినం కావడం, విద్యార్థులెవరూ అనుమానం పట్టకూడదనే ఉద్దేశంతో యూనివర్సిటీ ప్రధాన గేటుకు తాళం వేసి, లోపల బుల్డోజర్లు నడిపించారు. అయితే, విద్యార్థులు వెంటనే స్పందించి, భూముల చదును ప్రక్రియను అడ్డుకున్నారు. పోలీసులు పెద్ద ఎత్తున యూనివర్సిటీలో మోహరించారు. క్యాంపస్ అంతర్గత రోడ్లన్నీ బారికేడ్లతో మూసివేసి, బయటినుంచి ఎవరు లోపలికి రాకుండా, లోపలివారు బయటకు వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. విద్యార్థులు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసన తెలుపగా, పోలీసులు వారిని బలంగా అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించారు.
హెచ్సీయూ భూములపై రాజకీయ దుమారం
విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు ఈ వ్యవహారంపై విమర్శలు గుప్పించాయి. “హెచ్సీయూ భూములను ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించడాన్ని మేము సహించం” అంటూ విద్యార్థులు హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని రాజకీయ పార్టీలు కూడా విద్యార్థులకు మద్దతుగా నిలుస్తున్నాయి. హెచ్సీయూ భూములను ప్రైవేటు సంస్థలకు అప్పగించవద్దు. పోలీసుల జోక్యాన్ని వెంటనే నిలిపివేయాలి. అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలి. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి. ప్రభుత్వం విద్యార్థుల నిరసనను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. విద్యార్థులు తమ ఆందోళనను మరింత ఉధృతం చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. యూనివర్సిటీ భూముల వివాదం మరింత రాజకీయ రంగు పులుముకునే అవకాశముంది. విద్యార్థుల ఆందోళన ఇక ఈ ప్రభుత్వ వ్యవహార శైలి పైన విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీ భూములను ప్రైవేటుపరం చేస్తామంటే ఊరుకోమని వాళ్ళు తెగేసి చెబుతున్నారు.