1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి జ్ఞానేష్ కుమార్ భారత 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జ్ఞానేష్ కుమార్ ను దేశ తదుపరి ప్రధాన ఎన్నికల కమిషనర్ గా.. హర్యానా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వివేక్ జోషిని ఎన్నికల కమిషనర్ గా నియమించినట్లు ఇటీవల ఒక గెజిట్ నోటిఫికేషన్ ద్వారా న్యాయ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. సీఈసీగా జ్ఞానేష్ కుమార్ పదవీ కాలం జనవరి 26, 2029 వరకు ఉంటుంది. అంతకు ముందు ఈ పదవిలో ఉన్న రాజీవ్ కుమార్ ఫిబ్రవరి 18న పదవీ విరమణ చేశారు.
18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయ
జ్ఞానేష్ కుమార్ 4 సంవత్సరాల పదవీ కాలంలో 20 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతం(పుదుచ్చేరి)లో ఎన్నికలు జరుగుతాయి. ఆయన పదవీ కాలంలో ఎన్నికలు బీహార్ నుంచి ప్రారంభం కానుండగా.. చివరి ఎన్నికలు మిజోరాంలో జరుగుతాయి. బాధ్యతలు స్వీకరించిన అనంతరం కొత్తగా నియమితులైన ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ.. జాతి నిర్మాణంలో మొదటి అడుగు ఓటు వేయడమేనని అన్నారు. అందువల్ల 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయ పౌరుడు ఓటరుగా మారాలన్నారు. ఓటర్లు ఎన్నికల్లో తప్పకుండా ఓటు వేయాలన్నారు.

సుఖ్బీర్ సింగ్ సంధు అభినందనలు
భారత 26వ సీఈసీగా ఉన్న కాలంలో జ్ఞానేష్ కుమార్ ఈ ఏడాది చివరలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలను, 2026లో కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలను పర్యవేక్షిస్తారు. అదే విధంగా 2026లో జరగనున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను ఆయన పర్యవేక్షిస్తారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించినందుకు ఎన్నికల కమిషనర్ సుఖ్బీర్ సింగ్ సంధు అభినందనలు తెలిపారు. జ్ఞానేష్ కుమార్ ఎవరు? 1988 బ్యాచ్ కేరళ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన జ్ఞానేష్ కుమార్ జనవరి 27, 1964న ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో జన్మించారు. ఆయన ఐఐటీ కాన్పూర్ నుంచి సివిల్ ఇంజనీరింగ్ లో బీటెక్, ICFAI నుండి బిజినెస్ ఫైనాన్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్, హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి పర్యావరణ ఆర్థిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పొందాడు.
కేరళ ప్రభుత్వ కార్యదర్శిగా జ్ఞానేష్ కుమార్
కేరళ ప్రభుత్వ కార్యదర్శిగా జ్ఞానేష్ కుమార్ ఆర్థిక వనరులు, ఫాస్ట్-ట్రాక్ ప్రాజెక్టులు, ప్రజా పనుల శాఖ వంటి వివిధ విభాగాలను నిర్వహించారు. భారత ప్రభుత్వంలో ఆయనకు రక్షణ మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీగా, హోంమంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీ,అదనపు కార్యదర్శిగా.. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా, సహకార మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా పనిచేసిన అనుభవం ఉంది. ఆయన జనవరి 31,2024న భారత ప్రభుత్వ సహకార కార్యదర్శిగా పదవి విరమణ చేసి.. మార్చి 14, 2024న భారత ఎన్నికల కమిషన్ లో ఎన్నికల కమిషనర్ గా నియమితులయ్యారు.