హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికులకు అదిరే శుభవార్త. కేవలం 99 రూపాయలతో సౌకర్యవంతంగా హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకోవచ్చు.హైదరాబాద్-విజయవాడ మధ్య ఫ్లిక్స్ ఈవీ బస్సుల్ని తెలంగాణ రవాణాశాఖమంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈటీవో మోటార్స్తో కలిసి ఫ్లిక్స్ బస్ ఇండియా ఈ బస్సుల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ జెండా ఊపి ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం ఈవీ (విద్యుత్ వాహనాలు)లను ప్రోత్సహిస్తోందన్నారు . ప్రతి వాహనం ఈవీ ఉండాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన అన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రవాణా వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని ఈ మేరకు రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెంచడం కోసం కొత్త విధానాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ‘రాష్ట్రంలో ఈవీ పాలసీ ప్రకారం, రోడ్డు టాక్స్, రిజిస్ట్రేషన్ టాక్స్ను 2026 డిసెంబర్ 31 వరకు మినహాయింపు ఇచ్చాము.. ఈ విధానం వల్ల కాలుష్యాన్ని తగ్గించడం, నగరంలో వాయు కాలుష్యాన్ని నియంత్రించడం సాధ్యమవుతుంది. ఈ సేవలు ప్రారంభమైన తర్వాత నాలుగు వారాల పాటు హైదరాబాద్ నుంచి విజయవాడకు కేవలం రూ. 99తో ప్రయాణించవచ్చని వివరించారు. అన్ని ప్రభుత్వ పథకాలు ఈ బస్సుల్లో వర్తిస్తాయని, 5 గంటల్లోనే గమ్యస్థానం చేరుకోవచ్చన్నారు ఆ తర్వాత విజయవాడ-విశాఖపట్నం మధ్య కూడా తమ బస్సుల్ని ప్రారంభిస్తామని తెలిపారు.
‘ఈటో మోటార్స్ ఫ్లిక్స్ బస్ ఎలక్ట్రిక్ బస్సును మొదటిసారి తెలంగాణలో ప్రారంభించడం రాష్ట్రంలో పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకుంటున్న కొత్త చర్యలు చూపిస్తాయి. రవాణా శాఖకి సంబంధించిన అన్ని నిబంధనలను పాటించాలి ఈవీ బస్సుల వినియోగం పెరిగితే, భవిష్యత్తులో మరిన్ని రకాల ఈవీ బస్సులు ప్రవేశపెట్టాలి’ అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.