Harish Rao : రుణమాఫీ పూర్తిగా అమలు చేయకుండా రేవంత్ ప్రభుత్వం గొప్పలు చెబుతోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్రావు విమర్శలు చేశారు. కేసీఆర్ హయాంలో సరైన సమయంలో రైతుబంధు, రైతు భీమా ఇచ్చామని గుర్తుచేశారు. ఇవాళ(శనివారం) నంగూనూర్ మండలం రాజగోపాల్ పేటలో ఇటీవల కురిసిన అకాల వర్షాలతో దెబ్బతిన్న పంట పొలాలను హరీష్రావు పరిశీలించారు. ఈ సందర్భంగా హరీష్రావు మీడియాతో మాట్లాడారు.

వడగళ్ల వర్షంతో నష్టపోయిన కౌలు రైతులను ఆదుకోవాలి
గత కేసీఆర్ ప్రభుత్వం చనిపోయిన రైతులకు రైతు భీమా ఇచ్చిందని, కానీ రేవంత్ ప్రభుత్వం మాత్రం ఇవ్వడం లేదని చెప్పారు. వానకాలం పంటలకు ఉచిత విత్తనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వానికి ముందు చూపు లేక పచ్చి రొట్టె విత్తనాలను ఇవ్వడం లేదని అన్నారు. కౌలు రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. వడగళ్ల వర్షంతో నష్టపోయిన కౌలు రైతులను ఆదుకోవాలని హరీష్రావు కోరారు.
భీమా పథకం మూడు నెలల నుంచి ఇవ్వడం లేదు
పంటల భీమా ఇస్తామని ఇంతవరకు రైతులకు పంటల భీమా ఇవ్వలేదని హరీష్రావు అన్నారు. గత యాసంగి పంట నష్టం 1350 ఎకరాలని ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భీమా పథకం మూడు నెలల నుంచి ఇవ్వడం లేదని అన్నారు. చనిపోయిన అన్నదాతల కుటుంబాలు రైతు భీమా కోసం ఆఫీసుల చుట్టూ తిరిగి అలసిపోతున్నాయని చెప్పారు. అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భీమా ప్రీమియం కట్ట లేదా అని నిలదీశారు. బీఆర్ఎస్ పార్టీకి పేరు వస్తోందని రైతుబంధు పథకాన్ని పూర్తిగా ఇవ్వడం లేదని హరీష్రావు మండిపడ్డారు.