తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎంతటి తప్పుడు కేసులు నమోదు చేసినా, ఎంతటి ఇబ్బందులు తేవడాన్ని యత్నించినా తాను కానీ, పార్టీ శ్రేణులు కానీ ఏమాత్రం భయపడబోమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. వైసీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) సమావేశంలో పాల్గొని ఆయన పార్టీ శ్రేణులకు చెప్పారు.

గత అనుభవాన్ని గుర్తు చేసిన జగన్
జగన్ మాట్లాడుతూ, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నన్ను అన్యాయంగా 16 నెలల పాటు జైలులో ఉంచారు. పార్టీని నడిపించలేని పరిస్థితులు తీసుకొచ్చారు. అయినా ప్రజలు నమ్మికతో నన్ను ఆదరించారు. ఉప ఎన్నికల్లో అనూహ్యమైన విజయాన్ని అందించారు, అని చెప్పారు. ఇప్పుడు కూడా ప్రభుత్వ అణచివేత చర్యలు ఏమాత్రం తమ ప్రయాణాన్ని ఆపలేవని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రతి గ్రామంలో మన పార్టీ ఉంది. వాళ్లు ఎన్ని కేసులు పెడితే ప్రజలు అంత తీవ్రంగా స్పందిస్తారు. నన్ను మరోసారి జైలుకు పంపినంత మాత్రాన ప్రజా వ్యతిరేకతను అణచివేయలేరు అని అన్నారు. గతంలో అక్రమాస్తుల కేసులో తనను అన్యాయంగా ఇరికించి జైలుకు పంపినా, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి అఖండ విజయాన్ని అందించారని జగన్ గుర్తుచేశారు. అదే విధంగా, ఇప్పుడు కూడా ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని కేసులు బనాయించినా ప్రజల మద్దతు తమకే ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు ఎదురైనా ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని జగన్ ఈ సమావేశం ద్వారా సంకేతాలు పంపారు. ప్రభుత్వ చర్యల వల్ల ప్రజల్లో వ్యతిరేకత పెరిగి, అది అంతిమంగా తమ పార్టీకే లాభిస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రతి కార్యకర్త ప్రజల మధ్య గళమెత్తి ప్రభుత్వ వైఖరిని బహిర్గతం చేయాలని పిలుపునిచ్చారు.
Read also: AP Govt: ఏపీకి కేంద్రం గుడ్న్యూస్