ఫార్ములా ఈ కార్ రేస్లో అవినీతి ఆరోపణలపై ఏసీబీ, ఈడీ దర్యాప్తును ముమ్మరం చేశాయి. ఈ-కార్ రేస్కు సంబంధించిన లావాదేవీలపై లోతైన విచారణ చేపట్టిన ఈడీ, ఇప్పటికే కేసు నమోదు చేసింది. 55 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్, స్పాన్సర్షిప్ విషయంలో స్పష్టత లేకపోవడమే ప్రధాన కారణమని సమాచారం.
ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్తో పాటు అరవింద్ కుమార్, ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలకు నోటీసులు ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది. ఈ రేస్కు సంబంధించిన వివరాలను సేకరించిన ఏసీబీ, నిబంధనలకు విరుద్ధంగా నిధులు వినియోగించినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. ఫార్ములా ఈ కార్ రేస్ కోసం ప్రభుత్వం ఇచ్చిన స్పాన్సర్షిప్ గురించి ఈడీ ప్రత్యేక దృష్టి పెట్టింది. స్పాన్సర్గా ప్రకటించిన కొన్ని కంపెనీలు చివరి నిమిషంలో తప్పుకోవడంపై ప్రశ్నలు నెలకొన్నాయి.
ఈ వ్యవహారంలో పాల్గొన్న కంపెనీల లావాదేవీల వివరాలను ఈడీ సేకరించింది. హిమాయత్నగర్లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ను సందర్శించనున్న ఏసీబీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుంచి ట్రాన్సాక్షన్ వివరాలు కోరనుంది. బ్యాంకింగ్ లావాదేవీలు, ఆర్థిక వనరుల వినియోగంపై అధికారులు మరింత సమాచారం సేకరించనున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఏసీబీ, ఈడీ సంయుక్తంగా పని చేస్తూ, నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, నిధుల వినియోగంపై ఇప్పటికే వివాదాలు రేగగా, ఈ విచారణ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.