హైదరాబాద్ నగరంలోని ఎర్రగడ్డ మానసిక ఆరోగ్యశాఖ ఆసుపత్రి(Erragadda Hospital)లో ఫుడ్ పాయిజన్ కేసు (Food Poisoning Case) తీవ్ర కలకలం రేపింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మానసిక రోగులకు సరఫరా చేసిన ఆహారం కారణంగా, ఒక్కసారిగా అనేక మంది రోగులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 30 మందికి పైగా రోగులు వాంతులు, పేగుల నొప్పులు, తల తిరుగుడు వంటి లక్షణాలతో బాధపడుతూ చికిత్స కోసం హుటాహుటిన ఆసుపత్రి లోపలే ఐసోలేషన్ వార్డులకు తరలించబడినట్లు సమాచారం.
మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది
అస్వస్థతకు గురైన రోగులకు వైద్యులు తక్షణమే చికిత్స ప్రారంభించారు. అయితే చికిత్స పొందుతూ ఒక మానసిక రోగి ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. మృతుడి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది. ఈ ఘటనపై ఆసుపత్రి సిబ్బంది, ఫుడ్ సప్లై కాన్ట్రాక్టర్లపై దర్యాప్తు ప్రారంభించాల్సిన అవసరం ఉన్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మానసిక రోగుల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం
ఫుడ్ పాయిజన్ ఘటనపై ప్రభుత్వం స్పందించి విచారణకు ఆదేశించాలని పలువురు ఆరోగ్య కార్యకర్తలు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మానసిక రోగుల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహించరాదని, భవిష్యత్లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో పరిస్థితిని అధికారులు సమీక్షిస్తున్నారని తెలుస్తోంది.
Read Also : ABV:శవాలపై రాజకీయాలు చేసే వ్యక్తి జగన్: ఏబీవీ