ఢిల్లీలో వివాహేతర సంబంధాలపై ఓ కేసులో హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఒక వ్యక్తి తన భార్యను విడాకులు తీసుకోకముందే మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందంటూ, ఆ ప్రియుడిపై నేరారోపణలు మోపాడు. అయితే ఈ కేసులో అభియోగాల నుండి విడుదల చేస్తూ, “వివాహేతర సంబంధం నేరంగా పరిగణించలేము” అని ఢిల్లీ హైకోర్టు తేల్చింది. న్యాయమూర్తి జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ ఈ తీర్పును వెలువరించారు.
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఉదాహరణ
ఇందులో భాగంగా ఆమె 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉదహరించారు. ఆ తీర్పు ప్రకారం, ఐపీసీ సెక్షన్ 497 (అడల్టరీ) రాజ్యాంగబద్ధం కాదని, వివాహేతర సంబంధాన్ని నేరంగా పరిగణించలేమని సుప్రీంకోర్టు అప్పట్లో స్పష్టం చేసింది. ఈ తీర్పును ఆధారంగా తీసుకున్న హైకోర్టు, “ఇది నైతికతకు సంబంధించిన అంశం తప్ప నేరం కాదు” అని పేర్కొంది.

సెషన్స్ కోర్టు మళ్లీ ఈ తీర్పును రద్దు చేసి సమన్లు
ప్రస్తుతం కేసులో వ్యక్తి తన భార్య ప్రియుడిపై మేజిస్ట్రేట్ కోర్టులో కేసు వేయగా, కోర్టు అతనిని విడుదల చేసింది. అయితే సెషన్స్ కోర్టు మళ్లీ ఈ తీర్పును రద్దు చేసి సమన్లు జారీ చేయగా, ఆ ప్రియుడు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టు విచారించి, అతనికి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో వివాహేతర సంబంధాలపై చర్చ మరింత వేడెక్కింది. ఈ తీర్పు నైతికత మరియు చట్టం మధ్య ఉన్న స్పష్టమైన భిన్నతను మరోసారి ప్రజల ఎదుట ఉంచింది.