అగ్రరాజ్యం అమెరికాకు స్వప్రయోజనాలే పరమావధి. దీని కోసం ఏ స్థాయికన్నా దిగజారుతుంది. స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బయటపెట్టిన సంచలన విషయాలతో మరోసారి ఇది నిజమేనని తేలిపోయింది. భారత ఎన్నికల ప్రక్రియలో గత జో బైడెన్ యంత్రాంగం జోక్యం చేసుకోవడమే కాదు.. దీని కోసం భారీగా నిధులు ఖర్చు చేసినట్లు స్వయంగా ట్రంప్ సొంతింటి గుట్టును బయటపెట్టడం దేశ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. గతంలో తాము అనుమానించిందే నిజంకావడంతో ఇప్పుడు బీజేపీ కన్నెర్రజేస్తోంది. తమకు నచ్చినట్టు ఉంటే సరి.. లేదంటే ఆ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేయాలి. ఇది అగ్రరాజ్యం అమెరికా తీరు.

బైడెన్ హయాంలో చేసిన చీకటి పనులు
తమ ఆయుధాలు అమ్ముకోవడం కోసం కొన్ని దేశాల మధ్య చిచ్చు రాసేయడం కూడా ఆ దేశానికి అలవాటే అన్న ఆరోపణలు చాలాకాలంగానే ఉన్నాయి. మరీ ముఖ్యంగా గత జో బైడెన్ హయాంలో చేసిన చీకటి పనులన్నీ బహిర్గతం చేస్తూ సంచలనం సృష్టిస్తున్నారు. అలా బయటపడ్డదే.. భారత్లో మోదీ సర్కారును కూల్చేందుకు బైడెన్ సర్కారు పన్నిన కుట్ర. భారత్లో నరేంద్ర మోదీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ (BJP) ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నారు. భారత్లోని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు, పత్రికలు, మీడియా సంస్థలు, సామాజిక మాధ్యమాలకు నిధులు అందజేసి వ్యతిరేక కథనాలు వండి వార్చింది. ఈ మొత్తం క్రతువులో కీలక పాత్ర పోషించింది ఎవరో కాదు.. ఓ తెలుగు మహిళ. USAID ఇండియా చీఫ్గా పనిచేసిన ఆ మహిళ పేరు వీణా రెడ్డి.
ఎవరు ఈ వీణా రెడ్డి?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టిన వీణా రెడ్డి అమెరికా రాయబారిగా ఎదిగారు. యూనివర్సిటీ ఆఫ్ షికాగో నుంచి డిగ్రీ, పీజీ చేసిన ఆమె కొలంబియా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లా నుంచి డాక్టరేట్ కూడా పొందారు. న్యూయార్క్, కాలిఫోర్నియా బార్ కౌన్సిల్ సభ్యురాలిగా కూడా ఉన్నారు. 2024లో లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత జులై 17న తిరిగి వెనక్కి వెళ్లిపోయారు. అధికారిక కార్యక్రమాల మాటున.. చాటుగా USAID నిధులను Voter Turnout in India (భారత్లో ఓట్ల శాతం) పెంచడం కోసం 21 మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టారన్నది ప్రస్తుత అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ చేస్తున్న ఆరోపణ. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ ఎంపీ మహేశ్ జెఠ్మలానీ డిమాండ్ చేస్తున్నారు. తద్వారా ఇదంతా వీణా రెడ్డికి తెలిసే జరిగిందా లేక ఆమె కూడా ఇందులో ఒక పావుగా మారారా అన్నది స్పష్టత వచ్చే అవకాశం ఉంది.