Bomb Blasts Case : దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో ఈరోజు(మంగళవారం) తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించనుంది. 2013లో జరిగిన పేలుళ్లలో 18 మంది చనిపోగా.. 130 మందికి గాయాలు అయ్యాయి. ఈ కేసు విచారణ జరిపిన ఎన్ఐఏ ఫాస్ట్ట్రాక్ కోర్టు మోస్ట్వాంటెడ్ ఉగ్రవాది యాసిన్ భత్కల్ సహా ఐదుగురికి మరణశిక్ష విధించింది. అయితే.. ఈ శిక్షను సవాల్ చేస్తూ ముద్దాయిలు హైకోర్టును ఆశ్రయించారు.

ప్రధాన నిందితుడిగా యాసిన్ భత్కల్
2013 ఫిబ్రవరి 21న నగరంలో అత్యంత రద్దీ ప్రాంతమైన దిల్సుఖ్ నగర్లో పేలుళ్లు సంభవించాయి. ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) దర్యాప్తు జరిపింది. విచారణలో 157 మంది సాక్ష్యాలను రికార్డ్ చేసింది. ఈ దర్యాప్తులో ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ ప్రధాన నిందితుడిగా తేలింది.
తీహార్ జైల్లో శిక్ష
నిందితులలో అసదుల్లా అఖ్తర్, వకాస్, తెహసీన్ అఖ్తర్, ఎజాజ్ షేక్, సయ్యద్ మక్బూల్ నిందితులుగా ఉన్నారు. మూడేళ్లపాటు ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానంలో జరిగిన విచారణ అనంతరం.. నిందితులపై మరణశిక్ష పడింది. ఈ కేసుతో పాటు పలు ఉగ్రదాడుల్లో కీలకంగా వ్యవహరించిన యాసిన్ భత్కల్ను 2013లో బీహార్-నేపాల్ సరిహద్దులో పట్టుకోగలిగారు. ఢిల్లీ(2008), దిల్సుఖ్ నగర్ పేలుళ్ల కేసు సహా పలు కేసుల్లో దోషిగా తేలడంతో తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు.
Read Also : నేడు గుజరాత్ కు సీఎం రేవంత్