Ugadi 2026: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు ప్రముఖులు ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఇంటా కొత్త ఆశలు, ఆలోచనలు చిగురించాలని ఆకాంక్షించారు. ఉగాది పచ్చడిలోని షడ్రుచుల మాదిరిగానే జీవితంలోని కష్టసుఖాలను సమానంగా స్వీకరిస్తూ ప్రజలందరూ సుఖశాంతులతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆయన కోరారు. ప్రకృతి పునరుజ్జీవానికి సంకేతమైన ఈ పండుగను అందరూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని సందేశాన్నిచ్చారు.

Ugadi 2026: తెలుగు రాష్ట్రాల్లో ఉగాది వేడుకలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ నూతన సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతం కావాలని, ముఖ్యంగా ‘స్వర్ణాంధ్ర విజన్ 2047’ లక్ష్యం దిశగా రాష్ట్రం అడుగులు వేయాలని ఆయన పేర్కొన్నారు. పేదరికం లేని సమాజ నిర్మాణం కోసం ప్రవేశపెట్టిన ‘పి4’ (P4) వంటి సంక్షేమ పథకాలను ప్రజలు అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. భావి తరాల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా ఈ ఏడాది సాగాలని ఆయన కోరారు.
మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు కూడా తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ‘పరాభవ’ నామ సంవత్సరం సమాజంలోని నకారాత్మక (నెగటివ్) ఆలోచనలకు పరాభవంగా మారి, సానుకూల (పాజిటివ్) ధోరణులకు ప్రాభవంగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ఉగాది పచ్చడిలోని ఆరు రుచులు జీవితంలోని గెలుపోటములకు సంకేతమని, వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగడమే ఈ పండుగ ఇచ్చే అసలైన స్ఫూర్తి అని ఆయన తన సందేశంలో వివరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: