చంద్రగ్రహణం కారణంగా మూతబడిన ప్రముఖ ఆలయాలు (Temples) తెలుగు రాష్ట్రాల్లో తిరిగి తెరుచుకున్నాయి. నిన్న గ్రహణం ముగిసిన తర్వాత ఆయా ఆలయాల అధికారులు శాస్త్రోక్తంగా శుద్ధి కార్యక్రమాలను నిర్వహించారు. సంప్రోక్షణ పూజల అనంతరం భక్తులకు దర్శనం కల్పించడం ప్రారంభించారు. ఈ సంప్రదాయం ప్రకారం గ్రహణ సమయంలో దేవతా మూర్తుల దర్శనం ఉండదు. కాబట్టి గ్రహణం ముగిశాక ఆలయాలను శుభ్రం చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించి సాధారణ కార్యకలాపాలను పునఃప్రారంభిస్తారు. తిరుమల, ఇంద్రకీలాద్రి, వేములవాడ, యాదగిరిగుట్ట, భద్రాచలం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు తిరిగి భక్తులతో కళకళలాడుతున్నాయి.
తిరుమలలో శ్రీవారి దర్శనం
చంద్రగ్రహణం సందర్భంగా మూసివేసిన తిరుమల శ్రీవారి ఆలయం వేకువజామున 2:40 గంటలకు తిరిగి తెరుచుకుంది. ఆలయ అధికారులు సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం భక్తులకు స్వామి వారి దర్శనం కల్పించారు. సుప్రభాత సేవను ఏకాంతంగా నిర్వహించారు. ఆ తర్వాత సర్వదర్శనం కోసం భక్తులను అనుమతించారు. దీంతో తిరుమలకు వచ్చిన వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ ఆలయం ఉదయం 8:30 గంటల నుంచి భక్తులకు దర్శనం ఇవ్వనుంది. అమ్మవారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు.
ఇతర ఆలయాల్లోనూ దర్శనాలు ప్రారంభం
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు కూడా చంద్రగ్రహణం అనంతరం భక్తుల దర్శనాలకు సిద్ధమయ్యాయి. వేములవాడలోని రాజరాజేశ్వర స్వామి ఆలయం, యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం, భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయాలను శుద్ధి చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత తిరిగి తెరిచారు. ఆలయాల్లో సంప్రదాయబద్ధంగా నిర్వహించిన సంప్రోక్షణ పూజల్లో భక్తులు పాల్గొన్నారు. దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తులు ఆలయాల తలుపులు తెరుచుకోవడంతో ఊరట పొందారు. ఈ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.