మేడారం సమ్మక్క–సారలమ్మ(Sammakka Saralamma) మహాజాతరలో తొలిగా గద్దెలకు వచ్చేది సారలమ్మనే అన్న భావన చాలా మందిలో ఉంది. కానీ గిరిజన సంప్రదాయాల ప్రకారం, గద్దెలపైకి ముందుగా అడుగుపెట్టే దేవత లక్ష్మీదేవర. ఈ విషయం ఆదివాసీ సంస్కృతిని దగ్గరగా తెలుసుకున్నవారికే బాగా తెలుసు. సమ్మక్క–సారలమ్మ గద్దెల ప్రారంభ సమయంలోనూ, జంపన్న వాగు వద్ద డప్పులు, వాయిద్యాల నడుమ నృత్యం చేస్తూ లక్ష్మీదేవర దర్శనం ఇవ్వడం సంప్రదాయం. ఈ దృశ్యం గిరిజన ఆచారాలకు అద్దం పడుతుంది.
Read Also: AP: శివరాత్రి తిరునాళ్ళకు శ్రీకాళహస్తి ముస్తాబు
నాయక్పోడ్ గిరిజనుల ఆరాధ్య దైవం
లక్ష్మీదేవర నాయక్పోడ్ అనే గిరిజన తెగకు ప్రధాన ఆరాధ్య దైవం. ఆదివాసీ కథనాల ప్రకారం, సమ్మక్కకు ఒక ఆడపడుచు ఉండగా ఆమెనే లక్ష్మీదేవరగా గిరిజనులు విశ్వసిస్తారు. అందుకే మేడారం జాతరలో ఆమెకు ప్రత్యేక స్థానం ఉంటుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బూరుగుపేట–నగరంపల్లి ప్రాంతంలో నేటికీ లక్ష్మీదేవర వెదురు చెట్టు రూపంలో దర్శనమిస్తుందని స్థానికులు చెబుతారు. అక్కడ ఆమెకు సంబంధించిన పురాతన ఆలయం కూడా ఉంది. లక్ష్మీదేవర గుర్రం రూపంలో దర్శనమిస్తే, పోతరాజు, కిష్టస్వామి చెక్కబొమ్మల రూపంలో పూజలు అందుకుంటారు.
55 కిలోమీటర్ల కాలినడక యాత్ర
మేడారం జాతర(Sammakka Saralamma) సమయంలో పగిడిద్దరాజు సోదరిగా భావించే లక్ష్మీదేవర అమ్మవారిని నాయక్పోడ్ గిరిజనులు గద్దెల వద్దకు తీసుకువస్తారు. బూరుగుపేట నుంచి కాల్వపల్లి, దూదేకులపల్లి మీదుగా అటవీ మార్గాల్లో సుమారు 55 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణం చేస్తారు. మేళతాళాలు, డప్పుల శబ్దాలు, సంప్రదాయ నృత్యాల మధ్య అమ్మవారిని పగిడిద్దరాజు వద్దకు తీసుకెళ్లడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ ఊరేగింపులో సంతానం లేని దంపతులు పాల్గొని లక్ష్మీదేవర ఆశీర్వాదం పొందడం కూడా ఒక ప్రత్యేక సంప్రదాయం. నాయక్పోడ్ తెగకు చెందిన రెడ్డి, తగిన, మేకల వంశీయులు అమ్మవారిని మేడారం గద్దెలకు అందరికన్నా ముందుగా చేర్చడం గిరిజన సంప్రదాయానికి ప్రతీక. మేడారం జాతరలో లక్ష్మీదేవర పాత్రను తెలుసుకుంటే, ఈ మహాజాతరలోని అసలైన ఆదివాసీ ఆత్మను అర్థం చేసుకున్నట్టే.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: