ప్రపంచంలోని అతిపెద్ద హిందూ ఉత్సవాలలో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన పూరీ జగన్నాథ రథయాత్ర (Puri Jagannath Rath Yatra) 2025 జూన్ 27వ తేదీ శుక్రవారం నాడు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ రథోత్సవాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు దేశవ్యాప్తంగా కాక విదేశాల నుంచీ లక్షలాది మంది భక్తులు పూరీ నగరానికి తరలివచ్చారు. దాంతో పూరీ వీధులు జనసంద్రంగా మారాయి. ‘జై జగన్నాథ’ (Jai Jagannath) నినాదాలతో ఆ ప్రాంతమంతా భక్తిరసమయంగా మారిపోయింది.
యాత్ర ప్రారంభం – ఆధ్యాత్మిక మహోత్సవం
ఆషాఢ మాసం శుక్లపక్ష ద్వితీయ రోజున ఈ యాత్రను నిర్వహిస్తారు. ఈ తొమ్మిది రోజుల ఉత్సవంలో భాగంగా, జగన్నాథ స్వామి తన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి 12వ శతాబ్దానికి చెందిన ప్రధాన ఆలయం నుంచి గుండిచా ఆలయానికి యాత్రగా వెళ్తారు. పురాణాల ప్రకారం గుండిచా ఆలయాన్ని స్వామి వారి జన్మస్థలంగా భక్తులు విశ్వసిస్తారు. సుమారు 3 కిలోమీటర్ల మేర సాగే ఈ యాత్రలో భక్తులు జగన్నాథుడి రథమైన ‘నందిఘోష్’, బలభద్రుడి రథం ‘తాళధ్వజ’, సుభద్ర దేవి రథం ‘దర్పదళన్’లను స్వయంగా లాగుతారు.
భద్రతా ఏర్పాట్లు – అత్యున్నత స్థాయిలో
భక్తుల భారీ భాగస్వామ్యం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర బలగాలు అప్రమత్తమయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఐదంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా 200 ప్లాటూన్ల పోలీసు బలగాలతో పాటు, బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ వంటి కేంద్ర బలగాలకు చెందిన 8 కంపెనీలను మోహరించారు. ఈ ఏడాది యాత్ర కోసం పూరీ నగరం చుట్టూ సుమారు 10,000 మంది ఒడిశా పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలు, హోంగార్డులు విధుల్లో ఉన్నారు.
అలాగే ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా పర్యవేక్షణ కోసం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. ఈసారి భద్రతలో భాగంగా ఆధునిక సాంకేతికతను కూడా వినియోగిస్తున్నారు. ఉత్తరా స్క్వేర్ నుంచి పూరీ పట్టణం వరకు, అలాగే పూరీ నుంచి కోణార్క్ మార్గంలో దాదాపు 275 ఏఐ ఆధారిత సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ట్రాఫిక్, భక్తుల కదలికలను నిరంతరం పర్యవేక్షించేందుకు తొలిసారిగా ఒక ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాన్ని కూడా నెలకొల్పారు.
Read also: Bonalu: తెలంగాణలో బోనాల సందడి షురూ..