ఈసారి జాతరలో భక్తులకు సరికొత్త అనుభూతినిచ్చేలా గద్దెల ప్రాంగణాన్ని పూర్తి రాతి కట్టడంగా తీర్చిదిద్దుతున్నారు. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ మేడారం చరిత్రను కళ్లకు కట్టేలా నిర్మాణాలు చేపడుతున్నారు. జాతర ప్రధాన స్వాగత తోరణంపై సమ్మక్క వంశీయుల చరిత్రను ప్రతిబింబించేలా 59 విగ్రహాలను (బొమ్మలను) చెక్కించినట్లు మంత్రి వెల్లడించారు. మేడారం కథలో కీలక ఘట్టాలు, గిరిజన యోధుల వీరగాథలు ఈ తోరణం ద్వారా నేటి తరానికి తెలిసేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేవలం ఒక పండుగలా కాకుండా, గిరిజన అస్తిత్వాన్ని చాటిచెప్పేలా ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి.
జాతరకు వచ్చే భక్తుల కోసం మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రోడ్ల మరమ్మతులు, తాగునీరు, పారిశుద్ధ్య పనులతో పాటు జంపన్న వాగు వద్ద భక్తులు స్నానాలు ఆచరించేందుకు వీలుగా ఘాట్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది. కోటి మందికి పైగా వచ్చే భక్తుల భద్రత కోసం భారీగా పోలీస్ బందోబస్తు, సీసీ కెమెరాల నిఘా కూడా ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. మేడారం వచ్చే ప్రతి భక్తుడికి అమ్మవార్ల ఆశీస్సులు లభించడంతో పాటు, ఎక్కడా అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆమె అధికారులను ఆదేశించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com