Medaram Jatara : మేడారంలో భక్తజన సంద్రం

Read Time:  1 min
Medaram 2026
Medaram 2026
FONT SIZE
GET APP

తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి గాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర భక్తజన సంద్రమైంది. రెండేళ్లకోసారి జరిగే ఈ మహా వేడుకలో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పోటెత్తారు. మేడారం చేరుకున్న భక్తులు ముందుగా పవిత్ర జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అనంతరం తమ ఇష్టదైవాలకు మొక్కులు తీర్చుకోవడానికి గద్దెల వద్దకు క్యూ కడుతున్నారు. భక్తులు తమ ఎత్తుకు తూగేలా ‘బంగారం’ (బెల్లం) తూకం వేసి, దానిని అమ్మవార్లకు సమర్పించుకుంటూ భక్తి పారవశ్యంలో మునిగిపోతున్నారు.

Elderly parents :వృద్ధతల్లిదండ్రుల ‘భద్రతకు చట్టాల ఆసరా!

జాతరలో అత్యంత కీలకమైన ఘట్టాలు ఒక్కొక్కటిగా ఆవిష్కృతమవుతున్నాయి. బుధవారం సాయంత్రం కొండాయి నుంచి గోవిందరాజులు, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు పెన్నెద్దుల బండ్లపై గద్దెల మీదకు చేరుకోవడంతో జాతర తొలి ఘట్టం ఘనంగా ముగిసింది. ఈ అపురూప దృశ్యాన్ని వీక్షించేందుకు భక్తులు గంటల తరబడి వేచి చూశారు. మరోవైపు, బుధవారం రాత్రి కన్నెపల్లి నుంచి సారలమ్మ అమ్మవారు గద్దె వద్దకు బయల్దేరారు. వడ్డెలు (పూజారులు) అమ్మవారి రూపమైన భరిణెను తీసుకువస్తుండగా, భక్తులు ‘శివసత్తుల’ పూనకాలు, డప్పు వాయిద్యాల మధ్య ఘనంగా స్వాగతం పలికారు.

జాతరలో అసలైన ఉత్కంఠభరిత ఘట్టం గురువారం (రేపు) ఆవిష్కృతం కానుంది. చిలుకలగుట్ట నుంచి సమ్మక్క అమ్మవారు కుంకుమ భరిణె రూపంలో గద్దెపైకి రానున్నారు. జిల్లా ఎస్పీ గాలిలోకి కాల్పులు జరిపి అమ్మవారికి అధికారికంగా స్వాగతం పలకడం ఈ జాతరలోనే అత్యంత ప్రత్యేకమైన ఘట్టం. సమ్మక్క కూడా గద్దెపైకి చేరుకోవడంతో జాతర పూర్తిస్థాయిలో ఊపందుకుంటుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు, తాగునీరు మరియు పారిశుధ్య సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించింది.

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.