హైదరాబాద్: కొంతకాలంగా భర్తలను భార్యలు హత్య చేస్తున్న ఉదంతాలు పెరుగుతుండడం తెలిసిందే. ఈ తరహా హత్య ల్లో స్వల్ప వ్యవధిలోనే నిందితులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. అయితే దేశ రాజధాని ఢిల్లీలో ప్రియుడి కోసం ఓ మహిళ తాళి కట్టిన భర్తను హత్య చేయగా ఏడాది తరువాత ఫోన్ సిగ్నల్ కారణంగా ఈ హత్యోదంతం వెలుగుచూసింది. దీంతో పోలీసులు నిందితులను కటకటాల్లోకి నెట్టారు.
వివరాలు ఇలా వున్నాయి
ఢిల్లీ (Delhi) లోని అలీపూర్కు చెందిన ప్రీతం ప్రకాష్ (42) ఒక రౌడీషీటర్. అతడిపై మాదకద్రవ్యాలు, ఆయుధాల చట్టం సహా ఇతర కేసులు పదికిపైగా వున్నాయి. ఇతనికి భార్య సోనియా (38)తో పాటు ఇద్దరు పిల్లలు వున్నారు. అయితే కొన్నేళ్లుగా సోనియా హరియాణాలోని సోనిపట్కు చెందిన రోహిత్ (40) అనే మరో నేరగాడితో వివాహేతర వెళుతుండడం, పోలీసు కేసుల్లో సంబంధం పెట్టుకుంది. భర్త తరచూ జైలుకు అరెస్టవుతుండడంతో సోనియా భర్తను శాశ్వతంగా దూరం చేయాలనుకుంది. ఇందులో భాగంగా 2024 జూలై ఐదవ తేదీన భర్త ప్రీతంతో సోనియా గొడవ పడింది. అదే రోజు రాత్రి నిద్ర పోయిన ప్రీతంను సోనియా బంధువు అయిన విజయ్ సహకారంతో తలపై ఇనుపరాడ్తో కొట్టి చంపేసింది. దీని తరువాత భర్త శవాన్ని ప్రియుడు రోహిత్ తో కలిసి సమీపంలోని అగ్వాన్పూర్ డ్రైనేజిలో పడవేశారు. ఈ తతంగాన్ని నిందితులు వీడియో తీశారు.
అమాయకంగా నటించి పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య
ఇక భర్తను హత్య (Murder of husband) చేసిన తరువాత సోనియా గత ఏడాది జూలై 20వ తేదీన అలీపూర్ పోలీసు స్టేషన్లో తన భర్త కనిపించడం లేదని అమాయకంగా నటించి ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని విచారణ చేబట్టారు. అయితే నెలలు గడిచినా ప్రీతంకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించక పోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఈ కేసును మూసివేయాలని అనుకుంటున్న దశలో ఏడాది తరువాత అంటే జూలై మూడవ వారంలో ప్రీతం మొబైల్ నంబర్ సోనిపట్లో యాక్టివ్ అయినట్లు పోలీసులు గుర్తించారు. ప్రీతం ఫోన్ సోనియా ప్రియుడు రోహిత్ వద్ద వుండడంతో అతన్ని అనుమానించి విచారించగా మొత్తం బండారం రట్టయ్యింది. తాను సోనియా ప్రియుడినని, ఆమె భర్తను హత్య చేశామని, శవాన్ని డ్రైనేజిలో పడవేసినట్లు రోహిత్ పోలీసులకు తెలిపాడు. ప్రీతం హత్యకు సోనియా నాలుగున్నర లక్షల రూపాయలను ఇచ్చిందని, ఈ డబ్బులు ఇంట్లో ప్రీతంకు సంబంధించిన ఆటోను అమ్మితే వచ్చిందని రోహిత్ పోలీసులకు తెలిపాడు.
ప్రీతం హత్య తరువాత అతని ఫోన్ ను సోనియా తనకు ఇచ్చి కొంతకాలం స్విచ్ ఆఫ్ చేయమని చెప్పిందని, ఏడాది తరువాత తాను దీనిని ఆన్ చేశానని రోహిత్ తెలిపాడు. కాగా ప్రీతం శవాన్ని అంతకు ముందు ఢిల్లీ పోలీసులు గుర్తు తెలియని శవoగా గుర్తించి పోస్టుమార్టం చేయించి అనాథ అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఫోరెన్సిక్ లాబ్లో వున్న కొన్ని అవయవాల నమూనాలకు డిఎన్ఎ పరీక్ష చేయించగా ఈ మృతదేహం ప్రీతందేనని తేలింది. కాగా ప్రీతం హత్య కేసులో ప్రధాన నిందితుడు విజయ్ పరారీలో వుండగా. ఇతర నిందితులు సోనియా, రోహిత్లను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. రో హితపై హత్య, ఆయుధాల చట్టం సహా నాలుగు కేసులున్నాయని పోలీసులు గుర్తించారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: