సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంగళవారం చోటు చేసుకున్న దారుణ హత్య స్థానికులను షాక్కు గురి చేసింది. పద్మశాలి కుల సంఘ ఎన్నికలపై ఓ వాట్సాప్ మెసేజ్(Whatsapp Message)కు కేవలం స్పందించినందుకే, మానుపురి కృపాకర్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఆయన స్థానికంగా చెప్పుల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కుల సంఘానికి చెందిన ఓ వర్గ నాయకుడు పోస్టు చేసిన మెసేజ్కు కృపాకర్ క్లాప్స్ ఎమోజీ పెట్టడంతో వివాదం మొదలైంది. అదే కులానికి చెందిన మరో వర్గ నేత శ్రీరాముల రాములు దీనిని తట్టుకోలేక తీవ్రంగా స్పందించి బెదిరింపులకు దిగాడు.
పెరిగిన ఉద్రిక్తతలు – హత్య దాకా చెలరేగిన రగడ
వివాదం తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో కృపాకర్ సమస్యను సదరు కుల పెద్దల సమక్షంలో పరిష్కరించేందుకు మంగళవారం ఉదయం పద్మశాలి సంఘ భవనానికి వెళ్లాడు. కానీ అప్పటికే అక్కడ ఎదురు చూస్తున్న రాములు, అతని కుమారుడు ధనుంజయ్తో పాటు మరో నలుగురు కలిసి కృపాకర్పై దాడికి పాల్పడ్డారు. బారిన పడిన కృపాకర్ తీవ్రంగా గాయపడటంతో అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించగా, మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచాడు.
పరిస్థితిపై తీవ్ర ఆగ్రహం – నిందితులపై కఠిన చర్యల డిమాండ్
ఈ హత్యకు గల కారణం కేవలం ఓ వాట్సాప్ మెసేజ్కే అన్న విషయాన్ని తెలుసుకున్న బాధిత కుటుంబం మరియు స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మృతునికి భార్య విజయలక్ష్మి, కుమార్తె అమూల్య, కుమారుడు అజయ్ ఉన్నారు. సంఘటనపై స్పందించిన పద్మశాలి సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పం శ్రీనివాస్, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కుల సంఘ స్థాయిలో జరిగిన ఘర్షణ ఈ స్థాయికి చేరుకోవడం శోచనీయం అని పేర్కొన్నారు. పోలీసులు ఈ కేసులో విచారణ ప్రారంభించి నిందితుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.
Read Also : Air India : ఎయిరిండియా విమానంలో మంటలు