సంగారెడ్డి జిల్లా (Sangareddy District) లో చోటుచేసుకున్న విషాద ఘటన స్థానికులను కలచివేసింది. యువ కానిస్టేబుల్ జీవితం ఆన్లైన్ గేమ్స్ వ్యసనానికి బలైపోయింది. ఆ గేమ్స్ మోజు చివరికి అతని ప్రాణాలను తీసింది. అప్పుల ఊబిలో చిక్కుకుని మానసికంగా కుంగిపోయిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడడం చుట్టుపక్కల వారిని దిగ్భ్రాంతికి గురి చేసింది.
Read Also: Vizianagaram: మద్యం కోసం భార్యపై ఆగ్రహం.. ప్రాణాలు తీసుకున్న భర్త!
వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి పట్టణ శివారులోని మహబూబ్సాగర్ చెరువు కట్టపై తన వద్ద ఉన్న రివాల్వర్తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. కల్హేర్ మండలానికి చెందిన కొటారి సందీప్ కుమార్ (25) సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు.
2024 బ్యాచ్కు చెందిన సందీప్ కుమార్ కొంతకాలంగా ఆన్లైన్ గేమ్స్కు బానిసయ్యాడు. వాటి కోసం బంధువులు, స్నేహితుల వద్ద లక్షల రూపాయలు అప్పు చేశాడు. అప్పులు తీర్చాలంటూ వారి నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో తట్టుకోలేకపోయాడు.
వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి
ఈ క్రమంలోనే ఈ దారుణ నిర్ణయం తీసుకున్నాడు. తండ్రి పదిహేనేళ్ల క్రితమే అనారోగ్యంతో మరణించగా, సందీప్కు తల్లి, చెల్లి ఉన్నారు. అతడికి ఇంకా వివాహం కాలేదు.ఆత్మహత్యకు ముందు సందీప్ ‘వెల్ విషర్స్’ పేరుతో ఒక వాట్సాప్ గ్రూప్ (WhatsApp Group) క్రియేట్ చేసి అందులో సూసైడ్ నోట్ పెట్టడం అందరినీ కలచివేసింది.

“అమ్మా.. చెల్లీ నన్ను క్షమించండి. నేను ఉన్నన్ని రోజులు మీకు నరకం చూపించా. నేను ఇంకా ఉంటే మీరు బాధపడుతూనే ఉంటారు. దయచేసి మా అమ్మను, చెల్లిని ఎవరూ ఏమీ అనకండి” అని అందులో ఆవేదన వ్యక్తం చేశాడు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అయితే, సందీప్ ఆత్మహత్యకు ఉపయోగించిన రివాల్వర్ ఎక్కడిది అనేది ప్రశ్నార్థకంగా మారింది. పోలీస్ స్టేషన్లోని స్టోర్ రూమ్ నుంచి ఎవరికీ తెలియకుండా తీసుకెళ్లాడా? లేక విధి నిర్వహణలో భాగంగా ఉన్నతాధికారులు ఇచ్చిందా? అనే కోణంలో సీఐ రమేష్ నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. చట్టాన్ని రక్షించాల్సిన ఓ యువ పోలీసు అధికారి ఇలా వ్యసనం బారిన పడి ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా విషాదాన్ని నింపింది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: