మలయాళ సినీ పరిశ్రమలో కలకలం రేపుతున్న వార్త ఒకటి బయటకొచ్చింది. ప్రముఖ నటి లక్ష్మీ మీనన్పై కిడ్నాప్ కేసు నమోదు కావడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. కొచ్చిలో జరిగిన ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేయగా, ఆమె స్నేహితుల్లో ముగ్గురిని అరెస్ట్ చేశారు. అయితే లక్ష్మీ మీనన్ ప్రస్తుతం పరారీలో ఉందని పోలీసులు వెల్లడించారు.అయితే ఆమె పేరును ఇంకా ఎఫ్ఐఆర్లో చేర్చలేదని కొచ్చి నగర పోలీస్ కమిషనల్ విమలాదిత్య (Kochi City Police Commissioner Vimaladitya) తెలిపారు. మరోవైపు తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కోసం లక్ష్మీ మీనన్ కేరళ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ బెచు కురియన్ థామస్ నేతృత్వంలో ధర్మాసనం సెప్టెంబర్ 17 వరకు ఆమెను అరెస్ట్ చేయరాదని ఆదేశాలు జారీచేసింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొచ్చిలోని వెలాసిటీ అనే పబ్లో లక్ష్మీ మీనన్, ఐటీ ఉద్యోగి మధ్య వివాదం తలెత్తింది.
కేసు వివరాలు
ఇద్దరూ కాసేపు వాదులాడుకున్న తర్వాత ఐటీ ఉద్యోగి వెళ్లిపోగా లక్ష్మీమీనన్ తన స్నేహితులతో కలిసి అతడిని కారులో వెంబడించింది. అర్థరాత్రి 12 గంటల ప్రాంతంలో నార్త్ రైల్వే బ్రిడ్జి దగ్గర కారును అడ్డగించి సాఫ్ట్వేర్ ఉద్యోగిని లక్ష్మీ మీనన్ (Lakshmi Menon) బ్యాచ్ బలవంతంగా తమ కారులోకి ఎక్కించుకున్నారు. కారులోనే అతడిపై దాడికి పాల్పడి అలువా-పరపూర్ జంక్షన్ వద్ద వదిలేసి వెళ్లిపోయారు. దీంతో బాధితుడు అక్కడి నుంచి నేరుగా పోలీస్స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఐటీ ఉద్యోగిని కారులో తీసుకెళ్తోన్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు కావడంతో పోలీసులు వాటిని సేకరించి నిందితుల్ని అరెస్ట్ చేశారు. లక్ష్మీమీనన్ పరారీలో ఉండటంతో ఆమె గురించి గాలింపు చేపట్టారు.తనపై నమోదైన అభియోగాలను లక్ష్మీమీనన్ ఖండించింది.

ముందస్తు బెయిల్ కోసం కేరళ హైకోర్టు
ముందస్తు బెయిల్ పిటిషన్లో పలు విషయాలను ఆమె పేర్కొన్నట్లుగా బయటికి వచ్చింది. ‘జరిగిన ఘటనతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నా ప్రతిష్ఠని దెబ్బతీసేందుకే ఈ కేసు పెట్టారు. నాపై చేస్తోన్న ఆరోపణల్లో నిజం లేదు. నిరాధార ఆరోపణలతో నన్ను ఇబ్బంది పెడుతున్నారు’ అని ఆమె పిటిషన్లో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో సెప్టెంబర్ 17 వరకు ఆమెకు రిలీఫ్ ఇచ్చిన కేరళ హైకోర్టు ఆ రోజున మరోసారి విచారణ జరిపి తదుపరి ఆదేశాలు ఇస్తామని పేర్కొంది. తమిళ, మలయాళ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న లక్ష్మీ మీనన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. గజరాజు, ఇంద్రుడు, పల్నాడు, చంద్రముఖి 2 వంటి డబ్బింగ్ సినిమాలతో మెప్పించింది. చివరిగా మలయాళ చిత్రం ‘రోంత్’ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది.
Read hindi news: https://hindi.vaartha.com/
Read Also: