హైదరాబాద్లోని మాదాపూర్లో ఉన్న శ్రీ చైతన్య విద్యా సంస్థల ప్రధాన కార్యాలయంలో ఆదాయపు పన్ను (ఐటీ) అధికారులు రెండో రోజు కూడా తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఈ దాడులు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, చెన్నై, ముంబయి, బెంగళూరు, ఢిల్లీ నగరాల్లోని శ్రీ చైతన్య కాలేజీలలోనూ జరుగుతున్నాయి. ప్రధానంగా అక్రమ లావాదేవీలు, ట్యాక్స్ ఎగవేత ఆరోపణలపై అధికారులు విచారణ చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా ఇప్పటివరకు ఐటీ అధికారులు రూ.5 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. విద్యాసంస్థల ఆర్థిక లావాదేవీలపై అధికారుల దృష్టి కేంద్రీకృతమైంది. ముఖ్యంగా ఫీజుల రూపంలో భారీగా నగదు లావాదేవీలు జరిగాయని, అందుకు సరైన పన్ను చెల్లింపులు జరగలేదనే అనుమానాల నేపథ్యంలో ఈ దాడులు చేపట్టినట్లు తెలుస్తోంది. శ్రీ చైతన్య విద్యాసంస్థల టాక్స్ చెల్లింపులపై ఐటీ శాఖ అధికారులు సాఫ్ట్వేర్ డేటాను పరిశీలిస్తున్నారు.
2020లో కూడా ఐటీ దాడులు
ఇది తొలిసారి కాదు, 2020లోనూ శ్రీ చైతన్య విద్యాసంస్థలపై ఐటీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో అధికారులు రూ.11 కోట్ల అక్రమ లావాదేవీలను గుర్తించి, భారీగా డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లోనూ ఇదే విధంగా క్యాష్ లావాదేవీలు జరిపి పన్నులు ఎగ్గొట్టారనే ఆరోపణలపై దర్యాప్తు సాగింది. అడ్మిషన్ల సమయంలో రసీదులు ఇవ్వకుండానే భారీగా ట్యూషన్ ఫీజులు వసూలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఫీజులను నేరుగా క్యాష్ రూపంలో తీసుకుని, వాటిపై సరైన పన్నులు చెల్లించకుండా అక్రమ లావాదేవీలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో విద్యాసంస్థల ఆర్థిక లావాదేవీలపై పూర్తి స్థాయి పరిశీలన కొనసాగుతోంది. ప్రస్తుత దాడుల్లో ఐటీ శాఖ అధికారులు బ్యాంక్ లావాదేవీలు, ఫీజుల చెల్లింపులు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కోట్ల రూపాయల విలువైన డాక్యుమెంట్లను సీజ్ చేసినట్లు సమాచారం. తనిఖీలు పూర్తయిన తర్వాత, అధికారికంగా వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
ప్రభుత్వం స్పందన
ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం కూడా కీలకంగా స్పందించే అవకాశముంది. విద్యా రంగంలో నకిలీ లావాదేవీలు, పన్ను ఎగవేతల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి పెద్ద మొత్తంలో నగదు తీసుకుని, దానిపై సరైన పన్ను చెల్లించకపోవడం విద్యాసంస్థల విశ్వసనీయతను ప్రశ్నార్థకంగా మార్చింది. శ్రీ చైతన్య విద్యాసంస్థల యాజమాన్యం ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, సంస్థ ప్రతినిధులు ఐటీ అధికారులకు పూర్తి సహకారం అందిస్తున్నట్లు సమాచారం. విద్యాసంస్థల లెక్కలు సరిగానే ఉన్నాయని, అవసరమైన అన్ని డాక్యుమెంట్లను అందజేస్తామంటూ వర్గాలు పేర్కొంటున్నాయి. కరోనా మహమ్మారి తర్వాత విద్యాసంస్థలపై పన్ను ఎగవేత ఆరోపణలు పెరుగుతున్నాయి. ఫీజులు భారీగా పెంచినప్పటికీ, ఆ మొత్తం ప్రభుత్వ పన్నులుగా చెల్లించకపోవడం పెద్ద సమస్యగా మారింది. అనేక విద్యాసంస్థలు తమ లావాదేవీలను సరిగ్గా లెక్కించకపోవడంతో ఐటీ శాఖ మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే రెండో రోజు కొనసాగుతున్న ఈ దాడులు మరికొన్ని రోజులు జరగొచ్చని సమాచారం. అధికారులు ఇంకా అనేక డాక్యుమెంట్లను పరిశీలన చేయాల్సి ఉంది. సోదాలన్నీ పూర్తయ్యాక, ఐటీ శాఖ అధికారికంగా ఒక నివేదిక విడుదల చేయనుంది.