బ్యాంకులో తాకట్టు పెట్టిన కస్టమర్ల బంగారానికి రక్షణగా ఉండాల్సిన ఓ బాధ్యతాయుతమైన అధికారి, తన దుర్వ్యసనం కోసం అదే బంగారానికి కన్నం వేశాడు. బెంగళూరులోని ఇండియన్ బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్న కిరణ్ అనే వ్యక్తి ఆన్లైన్ గ్యాంబ్లింగ్ (జూదం) కు బానిసయ్యాడు. ఈ క్రమంలో భారీగా డబ్బు పోగొట్టుకున్న అతను, ఆ నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు అడ్డదారి తొక్కాడు. కస్టమర్లు బ్యాంకులో కుదువ పెట్టిన సుమారు 2.7 కిలోల బంగారాన్ని (దీని విలువ మార్కెట్లో సుమారు రూ. 4 కోట్లు) అత్యంత చాకచక్యంగా కాజేశాడు. ఒక బ్యాంక్ అధికారి స్థాయి వ్యక్తి ఇలాంటి నేరానికి పాల్పడటం బ్యాంకింగ్ వ్యవస్థలో భద్రతపై ఆందోళన కలిగిస్తోంది.
Municipalities: 11 మున్సిపాలిటీల్లో ఛైర్మన్ ఎన్నిక వాయిదా
బ్యాంకులో సాధారణంగా లాకర్లను నిర్వహించడానికి ఇద్దరు అధికారుల అనుమతి అవసరం ఉంటుంది. అయితే, కిరణ్ తన పై అధికారి (మేనేజర్) లేని సమయాన్ని ఆసరాగా చేసుకున్నాడు. మేనేజర్ తన లాకర్ యాక్సెస్ కీలను కిరణ్కు అప్పగించి వెళ్లినప్పుడు, అతను ఆ అవకాశాన్ని దొంగతనానికి వాడుకున్నాడు. కస్టమర్ల గోల్డ్ లోన్ ప్యాకెట్ల నుండి బంగారాన్ని తీసి, వాటిని ఇతర ఫైనాన్స్ సంస్థల్లో తాకట్టు పెట్టి డబ్బు సంపాదించాడు. ఆ వచ్చిన డబ్బుతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ, ఆన్లైన్ జూదంలో పందాలు కాసేవాడు. ఎవరికీ అనుమానం రాకుండా ప్యాకెట్లను యథావిధిగా ఉంచేవాడు.
ఎంత జాగ్రత్తగా నేరం చేసినా ఏదో ఒక రోజు బయటపడక తప్పదు అనడానికి ఈ ఘటనే నిదర్శనం. ఒక మహిళా కస్టమర్ తన గోల్డ్ లోన్ తీర్చి, నగలను తిరిగి తీసుకోవడానికి బ్యాంకుకు రావడంతో ఈ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. కిరణ్ ఆమె నగలను ఇవ్వడంలో జాప్యం చేయడం, నీళ్లు నమలడంతో అనుమానం వచ్చిన బ్యాంకు ఉన్నతాధికారులు లోతుగా తనిఖీ చేయగా, పెద్ద ఎత్తున బంగారం మాయమైనట్లు తేలింది. పోలీసుల రంగప్రవేశంతో కిరణ్ అసలు రంగు బయటపడింది. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అతని వద్ద నుండి ప్రస్తుతం 700 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన సొమ్మును రికవరీ చేసే పనిలో ఉన్న అధికారులు, బ్యాంకు భద్రతా ప్రమాణాల ఉల్లంఘనపై కూడా దర్యాప్తు చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com