తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రంలో రైతులు, ఆర్టీసీ కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో సీఎం పూర్తిగా విఫలమయ్యారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశం లేకపోవడంతో పాలనలో నిర్లక్ష్యం పెరిగిందని మండిపడ్డారు.
బ్లాక్ మెయిల్, డైవర్షన్ రాజకీయాలు
రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో తీసుకెళ్లాల్సిన నాయకుడిగా కాకుండా, బ్లాక్ మెయిల్, డైవర్షన్ రాజకీయాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని రవిచంద్ర ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి చేతగాని పాలనతో రాష్ట్ర అభివృద్ధి మందగించిందని, ప్రజల నమ్మకాన్ని కోల్పోయారని చెప్పారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదని, తన రాజకీయ ప్రయోజనాల కోసం అధికారాన్ని దుర్వినియోగిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
రాష్ట్రంపై అప్పుల భారం రోజురోజుకూ పెరుగుతుంది
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా ఎంపీ రవిచంద్ర తీవ్రంగా స్పందించారు. అప్పుల భారం రోజురోజుకూ పెరిగిపోతున్నదని, దీని ప్రభావం రాష్ట్ర ప్రగతిపై ప్రతికూలంగా పడుతున్నదని అన్నారు. తెలంగాణ పేరు, ప్రతిష్ఠను ముఖ్యమంత్రి దిగజారుస్తున్నారని ఆరోపించారు. ప్రజలు నిజమైన అభివృద్ధి కోసం బలమైన నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, రేవంత్ తీరుతో రాష్ట్రానికి నష్టం తప్పదని హెచ్చరించారు.
Read Also : Simhachalam Temple : నేడు సీఎం చంద్రబాబుకు రిపోర్ట్ సమర్పించిన కమిటీ చైర్మన్ సురేష్ కుమార్