ఈటీవీ విన్ కథాసుధ శీర్షిక కింద ప్రతీఆదివారం ప్రసారమవుతున్న ప్రత్యేక అనుభూతుల కథల శ్రేణిలో, వెండిపట్టీలు అనే సున్నితమైన కథ ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ ఎపిసోడ్ను రచించి, దర్శకత్వం వహించినవారు వేగేశ్న సతీష్. పల్లె జీవితాన్ని, సాధారణమైన కుటుంబాన్ని ఆధారంగా చేసుకుని, గాఢమైన భావోద్వేగాలను మిళితం చేస్తూ కథనం సాగుతుంది.
వీరబాబు పాత్రలో బాల ఆదిత్య ఒక పల్లె రైతుగా చాలా సహజంగా నటించారు. సీతగా లతా విశ్వనాథ్ రెడ్డి, ఒక నిస్సహాయతతోనూ, మమకారంతోనూ తన పాత్రను నడిపించారు. వారిద్దరి కూతురు దుర్గా పాత్రలో బేబీ వరేణ్య నటన మనసుని తాకుతుంది. ఈ కథలో వీరబాబు దంపతులు స్వంతంగా భూమిలేకపోయినా, కౌలుకు భూమిని తీసుకుని వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. తినడానికి సరిపడే పంట వస్తే చాలు అనే తృప్తితో, శ్రమను ప్రేమగా చూసే రైతు కుటుంబంలో ఓ చిన్న బాలికకి ఉన్న ‘వెండిపట్టీలు’ అనే కోరిక, చిన్నదే అయినా, ఆ కుటుంబానికి అది ఒక పెద్ద బాధ్యతగా మారుతుంది.
దుర్గా కోరిక – వెండిపట్టీలు:
పల్లె వాతావరణంలో పెరుగుతున్న చిన్నారి దుర్గా తనకి వెండిపట్టీలు కావాలని తల్లిదండ్రులను తరచూ అడుగుతూ ఉంటుంది. కానీ వారి ఆర్ధిక పరిస్థితి దానిని తీర్చే స్థితిలో లేదు. కావాలని ‘దుర్గ’ తరచూ మారాం చేస్తూ ఉండటం వలన, పంట డబ్బులు వచ్చాక కొనాలని అనుకుంటారు. అయితే ఆ రాత్రే ఓ అనూహ్యమైన సంఘటన జరుగుతుంది. అదేమిటి? కథ ఆరంభం నుంచి సున్నితంగా సాగుతూనే, ఒక్క రాత్రిలో జరిగే ఓ అనూహ్య సంఘటన కథను మలుపు తిప్పుతుంది. ఆ సంఘటన దంపతుల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో అనేది ప్రేక్షకులను కదిలించే విధంగా ఉంటుంది. ఈ మలుపు ఎమోషనల్ హైపాయింట్గా నిలుస్తుంది. కథాకథనాల పరంగా చాలా సాధారణంగా అనిపించే ఈ కథకి, పల్లె వాతావరణం కొత్త అందాన్ని తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది. పల్లె వాసనను .. పల్లె మనసుల స్వచ్ఛతను ఆవిష్కరించే ఈ కథ నుంచి కొన్ని అనుభూతులను ఏరుకోవచ్చు.
Read also: Sampurnesh Babu: సంపూర్ణేష్బాబు నటించిన ‘సోదరా’ సినిమా విడుదల ఎప్పుడంటే?