Mahesh Babu: ఈడీ అధికారులకు మహేశ్ బాబు లేఖ

Read Time:  1 min
Mahesh Babu: ఈడీ అధికారులకు మహేశ్ బాబు లేఖ
FONT SIZE
GET APP

ప్రఖ్యాత సినీ నటుడు మహేశ్ బాబు, నేడు (ఏప్రిల్ 27) హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో ఉన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో హాజరు కావాల్సి ఉన్నప్పటికీ, విచారణకు హాజరు కాలేదు. సాయి సూర్య డెవలపర్స్ మరియు సురానా గ్రూప్ ఆర్థిక లావాదేవీల విచారణలో భాగంగా, మహేశ్ బాబును ఈడీ అధికారులు విచారించాల్సి ఉంది.

ఈ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన మహేశ్ బాబు, వాటి ప్రమోషన్ కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రజలను సంస్థల పెట్టుబడుల వైపు ఆకర్షించడంలో మహేశ్ బాబు ప్రభావం చూపారని అధికారులు భావిస్తున్నారు.

భారీ పారితోషికం: ఈడీ సేకరించిన సమాచారం

వివరాల్లోకి వెళితే, సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ కంపెనీలకు మహేశ్ బాబు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు. ఈ సంస్థల ప్రమోషన్ల కోసం ఆయనకు భారీ మొత్తంలో పారితోషికం అందినట్లు ఈడీ గుర్తించినట్లు సమాచారం. చెక్కుల రూపంలో రూ. 3.4 కోట్లు, నగదు రూపంలో రూ. 2.5 కోట్లు, మొత్తం కలిపి రూ. 5.90 కోట్లు ఆయన స్వీకరించారని ఈడీ వర్గాలు భావిస్తున్నాయి. మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ సంస్థల్లో పెట్టుబడులు పెట్టేలా ప్రజలను ప్రోత్సహించారనే ఆరోపణల నేపథ్యంలో, ఈ నెల 22న ఈడీ అధికారులు మహేశ్ బాబుకు నోటీసులు జారీ చేశారు.

ఈడీ అధికారులకు మహేశ్ బాబు లేఖ

ఈరోజు ఉదయం 10:30కి విచారణ అధికారి ఎదుట హాజరుకావాల్సి ఉన్నప్పటికీ, మహేశ్ బాబు విచారణకు రాలేదు. తాను విచారణకు హాజరుకాలేకపోయిన కారణాలను వివరిస్తూ ఈడీకి లేఖ రాశారు. లేఖలో ప్రస్తుతం ఓ ముఖ్యమైన సినిమా షూటింగ్‌లో తాను బిజీగా ఉన్నానని, రేపు కూడా షూటింగ్ షెడ్యూల్ ఉండడంతో విచారణకు హాజరయ్యే అవకాశం లేదని, తనకు కొత్త తేదీ కేటాయించాలని అభ్యర్థించారు. మహేశ్ బాబు అభ్యర్థనపై ఈడీ అధికారులు ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాలి. ప్రస్తుతం మహేశ్ బాబు దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో ఎస్ఎస్ఎంబీ29 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కుతోంది. మహేశ్ సరసన ప్రియాంక చోప్రా నటిస్తున్న ఈ చిత్రం కోసం ప్రపంచ స్థాయి టెక్నీషియన్లు పనిచేస్తున్నారు.

Read also: Chiranjeevi : త్రీడీలో చిరు సూపర్ హిట్ సినిమా’జగదేక వీరుడు – అతిలోక సుందరి’

Sharanya

రచయిత గురించి

Sharanya

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.