బాలీవుడ్ నటి శిల్పా శెట్టి (Shilpa Shetty), ఆమె భర్త వ్యాపారవేత్త రాజ్ కుంద్రా మరోసారి వార్తల్లో నిలిచారు. వీరిపై తాజాగా పోలీసులు రూ.60 కోట్ల మోసం కేసులో లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. పెట్టుబడి పేరుతో భారీ మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలు వీరిపై వచ్చాయి. దీంతో స్టార్ కపుల్ మరోసారి చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
ముంబైకి చెందిన వ్యాపారి, లోటస్ క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్ దీపక్ కొఠారి చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన ఆరోపణల ప్రకారం, శిల్పా-రాజ్ కుంద్రా దంపతులు పెట్టుబడిదారుల నుంచి డబ్బులు తీసుకుని వాగ్దానం చేసిన విధంగా రాబడి ఇవ్వలేదని, మోసం జరిగిందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో దర్యాప్తు అధికారులు ముందస్తు జాగ్రత్తల భాగంగా లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
లుకౌట్ నోటీసు అంటే ఏమిటి?
లుకౌట్ నోటీసు అనేది ఇమిగ్రేషన్ లేదా పోలీసు అధికారులు జారీ చేసే ఒక రకమైన అధికారిక అలర్ట్. ఇది నిందితులు దేశం విడిచి పారిపోకుండా నియంత్రించేందుకు ఉపయోగపడుతుంది. విమానాశ్రయాలు, పోర్టులు, సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న అధికారులకు సమాచారం అందజేసి, నిందితుడిని బయటకు వెళ్లనీయకుండా అడ్డుకుంటారు. ప్రస్తుతం శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా దంపతులపై ఇలాంటి నోటీసులు జారీ చేయడం, కేసు తీవ్రతను సూచిస్తుంది.
శిల్పా శెట్టి ఎప్పుడూ తన ఫిట్నెస్, సినిమాలు, టీవీ షోలతో వార్తల్లో నిలుస్తుంటారు. కానీ ఆమె భర్త రాజ్ కుంద్రా వివాదాస్పద కేసుల్లో ఇంతకుముందే చిక్కుకున్నారు. ముఖ్యంగా అశ్లీల కంటెంట్ యాప్ కేసులో రాజ్ కుంద్రా (Raj Kundra) అరెస్ట్ అయ్యిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరోసారి భారీ ఆర్థిక మోసం ఆరోపణలు వీరి కుటుంబాన్ని ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి.
వ్యక్తిగత గ్యారెంటీ
2015 నుంచి 2023 మధ్య కాలంలో వ్యాపార విస్తరణ పేరుతో శిల్పా దంపతులు తమ వద్ద రూ. 60.4 కోట్లు తీసుకున్నారని, కానీ ఆ డబ్బును తమ వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించారని దీపక్ కొఠారీ ఈ ఏడాది ఆగస్టులో పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రాజేశ్ ఆర్య అనే వ్యక్తి ద్వారా తాను శిల్పా-రాజ్ దంపతులను కలిసినట్లు పిర్యాదులో పేర్కొన్నారు. ఆ సమయంలో వారు ‘బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్’ అనే హోమ్ షాపింగ్ కంపెనీలో డైరెక్టర్లుగా ఉన్నట్లు తెలిపారు.
దాదాపు 87.6% వాటా వారిదేనని చెప్పారు. మొదట వీరు 12% వడ్డీతో రూ. 75 కోట్ల రుణం కావాలని అడిగారు. కానీ ఆ మొత్తం పన్నుల భారం లేకుండా పెట్టుబడిగా మారుస్తే మంచిదని ఒప్పించారని ఆయన వివరించారు. ఈ క్రమంలో కొఠారీ, 2015లో రెండు విడతల్లో రూ. 31.9 కోట్లు, రూ. 28.53 కోట్లు బదిలీ చేశారు. 2016లో శిల్పా శెట్టి వ్యక్తిగత గ్యారెంటీ ఇచ్చినా, అదే ఏడాది ఆమె డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. అనంతరం, 2017లో మరో ఒప్పందం విఫలమవడంతో కంపెనీ దివాళా ప్రక్రియలోకి వెళ్లినట్లు తెలిసిందని ఆయన పేర్కొన్నారు.
ప్రాథమిక విచారణ
దీపక్ కొఠారీ ఫిర్యాదు ఆధారంగా ముంబై పోలీసులు ప్రాథమిక విచారణ నిర్వహించి, మోసం, నమ్మకద్రోహం తదితర సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మోసం మొత్తం రూ. 10 కోట్లకు పైగా ఉండటంతో, కేసును జుహు పోలీస్ స్టేషన్ నుంచి ఆర్థిక నేరాల విభాగానికి (EOW) బదిలీ చేశారు. ప్రస్తుతం కేసు విచారణ దశలో ఉంది. కేసు విచారణ సమయంలో దేశం విడిచిపోకుండా ఉండేందుకు శిల్పా దంపతులపై లుకౌట్ సర్క్యులర్ జారీ చేసినట్లు ఆర్థిక నేరాల విభాగ (Economic Offences Wing ) వర్గాలు తెలిపాయి. ఈ జంట ట్రావెల్ లాగ్లను కూడా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు.
Read hindi news : hindi.vaartha.com
Read also: