సినీ ఇండస్ట్రీలో దర్శకనిర్మాతలకు తలనొప్పిగా మారిన సమస్యపైరసీ. సినిమా విడుదలకు ముందే కొన్ని చిత్రాలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు లీక్ అవుతుంటాయి. ఇక థియేటర్లలో రిలీజ్ అయిన కొన్ని సినిమాలు గంటల వ్యవధిలోనే ఆన్లైన్లో ప్రత్యక్షమవుతున్నాయి. తాజాగా మలయాళీ స్టార్ హీరో మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కలిసి నటించిన లేటెస్ట్ మూవీ L2: ఎంపురాన్ పైరసీ బారిన పడింది. మార్చి 27న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మంచి రెస్పాన్స్ అందుకుంటున్నప్పటికీ, విడుదలైన కొద్దిగంటల వ్యవధిలోనే HD ప్రింట్ టెలిగ్రామ్ సహా పలు వెబ్సైట్లలో లీక్ అయ్యింది.
థియేటర్లలో హిట్
‘L2: ఎంపురాన్’ మలయాళం, హిందీ, తమిళ వెర్షన్లలో విడుదలైంది. సినిమా మాస్ ఆడియన్స్ను ఆకట్టుకుంటోంది. మంచి రివ్యూలు వస్తున్నాయి. అయితే అనూహ్యంగా ఈ మూవీ 1080p ఫుల్ HD ప్రింట్ ఆన్లైన్లో లభ్యమవుతుండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇది థియేటర్ ప్రింట్ కాదు అని సైబర్ నిపుణులు పేర్కొనడం మరింత ఆందోళన కలిగిస్తోంది. సినిమా అధికారికంగా థియేటర్ లేదా ఓటీటీ నుంచి లీక్ అయ్యిందా? లేక నిర్మాణ బృందంలోని ఎవరో దీనికి కారణమా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
L2: ఎంపురాన్ పైరసీపై సైబర్ పోలీసులు దర్యాప్తు
సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే టెలిగ్రామ్, పలు టోరెంట్ వెబ్సైట్లలో పైరసీ ప్రింట్ అందుబాటులోకి వచ్చింది. దీంతో కేరళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ దీనిపై సీరియస్గా స్పందించింది. నకిలీ వెర్షన్లను వ్యాప్తి చేస్తున్న వారిని గుర్తించేందుకు ప్రొఫెషనల్ ఎథికల్ హ్యాకర్లను నియమించినట్లు వెల్లడించింది. కోచ్చి సైబర్ పోలీసులు మాట్లాడుతూ – ఇప్పటివరకు అధికారిక ఫిర్యాదు రాలేదు. ఫిర్యాదు అందిన వెంటనే విచారణ ప్రారంభిస్తాం అని స్పష్టం చేశారు. సినిమాలు థియేటర్ రిలీజ్ తర్వాత కూడా పైరసీ బారిన పడడం కొత్త విషయం కాదు. ఈ సినిమాతో సంబంధం ఉన్న వారి నుండే ఈ సినిమా లీక్ అయిందనే అనుమానం ఉంది. కానీ HD క్వాలిటీ ప్రింట్ బయటకు రావడం సీరియస్ సమస్యగా మారింది. పైరసీ కారణంగా తొలివారం కలెక్షన్లు భారీగా ప్రభావితమవుతాయి, ఇది సినిమా ఇండస్ట్రీకి పెద్ద నష్టం. తాజాగా ‘L2: ఎంపురాన్’కు ఎదురైన ఈ పరిస్థితి మలయాళ సినిమా రంగంలో తీవ్ర చర్చకు దారితీసింది.
L2: ఎంపురాన్ – లూసిఫెర్ సిరీస్లో రెండో భాగం
పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ‘L2: ఎంపురాన్’, 2019లో విడుదలైన ‘లూసిఫెర్’ చిత్రానికి సీక్వెల్. ఈ సినిమాకు మురళి గోపి స్క్రిప్ట్ రాశారు. ఆంటోనీ పెరుంబవూర్, సుభాస్కరన్, గోకులం గోపాలన్ సంయుక్తంగా నిర్మించారు. దీపక్ దేవ్ సంగీతం, ప్రముఖ నటులు మోహన్ లాల్, మంజు వారియర్, టోవినో థామస్, సూరజ్ వెంజరమూడు, ఇంద్రజిత్, సానియా అయ్యప్పన్ తదితరులు ఈ చిత్రంలో నటించారు. అన్ని అడ్డంకులను దాటి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఇప్పటికే 100 కోట్ల క్లబ్లోకి ఎంటర్ అయింది. అయితే పైరసీ వల్ల కలెక్షన్లు ప్రభావితమయ్యే అవకాశముంది. పైరసీని నియంత్రించేందుకు కఠిన చర్యలు అవసరమని సినీ ప్రముఖులు అంటున్నారు.