సినిమా రిలీజ్ వరకు ఎంతగా ప్రమోట్ చేసుకున్నా, ఎంత హైప్ క్రియేట్ చేసినా, అసలు ఫలితం మాత్రం విడుదల తర్వాతే తెలుస్తుంది. నాని తన చిత్రం మీదున్న నమ్మకంతో రెండ్రోజుల ముందుగానే అంటే మార్చి 12న ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా మీడియాకు చూపించాడు. ఇది సాధారణంగా ఎవరూ చేయలేని సాహసం. మరి ఈ కోర్ట్ డ్రామా సినిమాగా ఎలా ఉంది? దర్శకుడు రామ్ జగదీష్ ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు? అనేది ఇప్పుడు చూద్దాం.
కథ
చంద్ర శేఖర్ అలియాస్ చందు (రోషన్) ఇంటర్ ఫెయిల్ అయ్యి పార్ట్ టైమ్ జాబ్స్ చేస్తూ కాలం వెళ్లదీస్తుంటాడు. ఫైనాన్స్ తీసుకుని బైక్ కొనుకుంటాడు. అతని జీవితంలో జాబిల్లి (శ్రీదేవీ) ప్రవేశిస్తుంది. మొదట ఫోన్ కాల్స్ ద్వారా పరిచయం మొదలై, ప్రేమగా మారుతుంది. అయితే, ఈ విషయం తెలిసి జాబిల్లి మామ మంగపతి (శివాజీ) కోపంతో చందుని పోక్సో చట్టం కింద అరెస్ట్ చేయిస్తాడు. ఈ కేసులో మంగపతికి లాయర్ దామోదర్ (హర్ష వర్దన్) సహాయపడతాడు. చందుని రక్షించేందుకు పెద్ద లాయర్ మోహన్ రావు (సాయి కుమార్) అసిస్టెంట్ తేజ (ప్రియదర్శి) ఏం చేస్తాడు? అసలు పోక్సో చట్టం ఏమి చెబుతుంది? దీన్ని అమాయకుల మీద ఎలా ఉపయోగిస్తున్నారు? చివరికి చందు ఏమవుతాడు? అన్నదే కథ.
సినిమా విశ్లేషణ
ఈ కోర్ట్ కథ ప్రస్తుతం చాలా మందికి కనెక్ట్ అవుతుంది. పోక్సో చట్టం మీద అవగాహన లేక, చేసేది చట్టరిత్యా నేరం అన్నది తెలీక చాలా మంది ప్రమాదంలో పడిపోయే అవకాశం ఉంది. అసలు ఇలాంటి ఓ చట్టం ఉందని, ఇలా చేస్తే తప్పు అది చేస్తే నేరం అని విడమరిచి చెప్పి, చట్టాల గురించి అందరికీ అవగాహన కల్పించే వ్యవస్థ లేకపోవడంతోనే ఎక్కువగా నేరాలు జరుగుతున్నాయని చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు.ప్రధానంగా “ఒక మైనర్ అమ్మాయిని ప్రేమించినా, ఆమె అంగీకారంతో ముట్టుకున్నా కూడా అది నేరమే” అనే ప్రశ్నను లేవనెత్తాడు,ఇది ప్రేక్షకుల్లో చర్చకు దారితీసే అంశం. సినిమా మొత్తం కోర్ట్ డ్రామాగా మలచినప్పటికీ, కథలో కొన్ని చోట్ల లాజిక్ మిస్ అయ్యింది.
ఫస్ట్ హాఫ్ ,సెకండ్ హాఫ్
ఫస్ట్ హాఫ్ ఎక్కువగా లవ్ స్టోరీ మీదనే నడుస్తుంది. కానీ ఈ లవ్ స్టోరీనే సినిమా వెనకడుగు వేయించే అంశం అయింది. చిన్నపాటి లవ్ ట్రాక్ను పొడిగించి చూపించడం కొంతమందికి నచ్చకపోవచ్చు. ఇక, మంగపతి క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్లో హైలైట్ అవుతుంది. అతని మాటలు, పనులు ప్రేక్షకులకు నిజమై అనిపిస్తాయి. కానీ సెకండ్ హాఫ్లో మంగపతి క్యారెక్టర్ పూర్తిగా నెగటివ్ షేడ్స్లోకి మారిపోతుంది.ప్రథమార్దంలో వచ్చే కథలెన్నో చెప్పారు అనే పాట బాగుంటుంది. ఆ పాట పిక్చరైజేషన్ కూడా బాగుంటుంది. ఇక ఇంటర్వెల్తో కథ కాస్త గాడిన పడుతుంది. కోర్ట్ డ్రామా ఎలా ఉంటుంది? ఎంత ఆసక్తికరంగా చూపిస్తారో? అన్న ఉత్కంఠతో సెకండాఫ్కు రెడీ అవుతాడు ప్రేక్షకుడు. అయితే కోర్ట్ డ్రామా కాస్త ఇంట్రెస్టింగ్గానే సాగుతుంది. పూర్తిగా ఎంగేజింగ్గా ఉందని కూడా చెప్పలేం. అసలు ఈ సినిమాలో చాలా డెప్త్ ఉందని కూడా అనిపిస్తుంది. ఎమోషనల్గానూ చాలా కనెక్ట్ చేసే కంటెంట్ ఉందనిపిస్తుంది. జై భీమ్ రేంజ్లో ఎమోషన్స్ను కనెక్ట్ చేసే అవకాశం ఉన్నా కూడా ఆ స్థాయిలో సినిమా ఆకట్టుకోదు.
నటీనటుల పెర్ఫార్మెన్స్
శివాజీ మంగపతి పాత్రలో తన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. అతని డైలాగ్స్, బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులపై ప్రభావం చూపిస్తాయి. ప్రియదర్శి తేజ క్యారెక్టర్లో బాగా నటించాడు. క్లైమాక్స్లో అతని నటన ప్రత్యేకంగా చెప్పుకోవాలి. హర్ష వర్దన్, సాయి కుమార్ లాయర్లుగా తమ క్యారెక్టర్లకు న్యాయం చేశారు. రోషన్, శ్రీదేవీ తమ పాత్రల్లో బాగానే చేశారు. రోహిణి, ప్రభావతి తల్లుల పాత్రల్లో ఎమోషనల్గా ఆకట్టుకున్నారు.
సాంకేతిక విభాగం
సంగీతం: విజయ్ బుల్గానిన్ అందించిన పాటలు బాగున్నాయి. “కథలెన్నో చెప్పారు” పాట అద్భుతంగా ఉంది. కెమెరా వర్క్: విజువల్స్ 2013 నేపథ్యంలో ఉండేలా నేచురల్గా చూపించారు. ఆర్ట్ డైరెక్షన్: కోర్ట్ సెట్ చాలా రియలిస్టిక్గా ఉంది. నిర్మాణ విలువలు: నాని ప్రొడ్యూసర్గా మంచి కంటెంట్ను తీసుకొచ్చాడు.సినిమా చక్కటి కాన్సెప్ట్ను ఎంచుకుంది. పోక్సో చట్టం గురించి తెలియని ప్రజలకు ఇది ఓ అర్ధవంతమైన సందేశాన్ని అందిస్తుంది. అయితే, ప్రేమ కథను ఎక్కువగా చూపించడం, కొంత చోట్ల కథ నెమ్మదించడం సినిమాకు మైనస్ పాయింట్స్. ఫస్ట్ హాఫ్ కొంచెం తగ్గించి ఉంటే సినిమా ఇంకా బెటర్గా ఉండేది.