ప్రముఖ నటి షఫాలీ జరివాలా (Shafali Jariwala) (42) ఆకస్మిక మృతి కేసులో కొత్త వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె గుండెపోటుతో మరణించిందన్న ప్రచారానికి భిన్నంగా, యాంటీ ఏజింగ్ మందులు (Anti-aging drugs) కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దర్యాప్తును అదే దిశగా ముమ్మరం చేశారు.జూన్ 27న, శుక్రవారం రోజున షఫాలీ ఉపవాసంగా ఉన్నట్లు సమాచారం. మధ్యాహ్నం ఆమె యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్ తీసుకున్నారు. ఆ తర్వాత రాత్రి ఖాళీ కడుపుతో పలు మాత్రలు వేసుకున్నారని పోలీసులు వెల్లడించారు. దీంతో ఆమె బీపీ ఒక్కసారిగా పడిపోయి ఉండొచ్చని వారు భావిస్తున్నారు.
భర్త ఆసుపత్రికి తరలించినా అప్పటికే ఆలస్యం
రాత్రి సమయంలో ఆమె అస్వస్థతకు గురికావడంతో భర్త పరాగ్ హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. షఫాలీ గుండెపోటుతో మరణించారన్న కథనాలపై కుటుంబ సభ్యులు ఎలాంటి ధ్రువీకరణ ఇవ్వకపోవడం మరింత అనుమానాలకు దారితీసింది.
ఇంట్లో ఉన్నవారినీ విచారించిన అంబోలి పోలీసులు
ఈ కేసును అంబోలి పోలీసులు గమనశీలంగా విచారిస్తున్నారు. ఇప్పటికే పది మందిని విచారించారు. భర్త, తల్లిదండ్రులు, ఇంటి పనిమనిషితో పాటు ఆమె కుప్పకూలిన సమయంలో ఇంట్లో ఉన్నవారినీ ప్రశ్నించారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి అనుమానాస్పద సమాచారం వెలుగులోకి రాలేదని పోలీసులు పేర్కొన్నారు.షఫాలీ ఇంటికి ఫోరెన్సిక్ నిపుణుల బృందం వెళ్లి, ఆమె వాడిన మందులు, ఇంజెక్షన్లు సేకరించింది. వీటిపై శాస్త్రీయ పరీక్షలు జరుగుతున్నాయి.
పోస్టుమార్టం రిపోర్టే కీలకం
ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే అసలు కారణం బహిర్గతమయ్యే అవకాశం ఉంది. ఆమె మృతిపై ఇంకా మిస్టరీ కొనసాగుతుండగా, అభిమానులు విషాదంలో మునిగిపోయారు.
Read Also : plane crash : అమెరికాలో టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే కూలిన విమానం