అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది రోజులే ఉండటంతో ఆమ్ ఆద్మీ పార్టీ ‘మధ్యతరగతి’ వర్గాలపై దృష్టిసారించింది. పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను అరవింద్ కేజ్రీవాల్ బుధవారం విడుదల చేశారు. 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఉచిత వైద్య చికిత్స కల్పిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. మధ్యతరగతి వారిపై భారం పడకుండా విద్యుత్, నీటి సరఫరాను ఆప్ ప్రభుత్వం పెంచిందని, వాటి రేట్లు తగ్గించిందని, తమ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే ప్రస్తుతం ఉన్న పథకాలను విస్తృతపరచడంతో పాటు మధ్యతరగతి ప్రజానీకంపై మరింత దృష్టి పెడతామని హామీ ఇచ్చారు.
గత 75 ఏళ్లలో ఒక పార్టీ తరువాత మరొకటి అధికారంలోకి వచ్చినప్పటికీ మధ్యతరగతి వారు అణిచివేతకు గురవుతున్నారని, మధ్యతరగతి ప్రజానీకానికి వారు చేసిందేమీ లేదని, పన్నులు కట్టే సాధనంగా, ఏటీఎంగా వారిని ఉపయోగించుకున్నారని కేజ్రీవాల్ అన్నారు.
మీడియా సమావేశంలో ఏడు డిమాండ్లను కేంద్ర ముందు కేజ్రీవాల్ ఉంచారు. ఎడ్యుకేషన్ బడ్జెట్ను 2 శాతం నుంచి 10 శాతానికి పెంచాలని, పీవీటీ స్కూళ్లను కూడా ఇందులో చేర్చాలని అన్నారు. ఉన్నత విద్యకు కేంద్రం సబ్సిడీలు, స్కాలర్షిప్లు ఇవ్వాలన్నారు. హెల్త్ బడ్జెట్ 10 శాతానికి తగ్గించాలని, ఆరోగ్య బీమా నుంచి పన్ను తొలగించాలని డిమాండ్ చేశారు. ఆదాయం పన్ను మినహాయింపు పరిమితిని రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలన్నారు. నిత్యవాసరాలపై జీఎస్టీ తొలగించాలి. సీనియర్ సిటిజన్లకు రోబస్ట్ రిటైర్మెంట్ ప్లాన్ ఏర్పాటు చేయాలని, దేశవ్యాప్తంగా ఉచిత హెల్త్ కేర్ అమలు చేయాలని అన్నారు. రైల్వే ప్రయాణాల్లో సీనియర్ సిటిజన్లకు ఇచ్చే రాయితీలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.