ఇప్పట్లో ప్రతి ఒక్కరూ యూపీఐ యాప్లను రోజూ వాడుతున్నారు. ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం లాంటివి మామూలుగా మారిపోయాయి. కానీ ఈయాప్లు వాడే వారందరికి త్వరలో ఓ మార్పు ఎదురవుతుంది. అది కూడా భద్రత కోణంలో ఎంతో ముఖ్యమైనదే.నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 (October 1) నుండి ‘కలెక్ట్ రిక్వెస్ట్’ అనే ఫీచర్ను పూర్తిగా తొలగించనుంది. అంటే ఇకపై మీరు వేరొకరిని డబ్బు అడగలేరు – యాప్ ద్వారా రిక్వెస్ట్ పంపే అవకాశం ఉండదు.ఈ ఫీచర్ స్నేహితులకు డబ్బు అడగడంలో ఉపయోగపడేది. కానీ, ఇదే అవకాశాన్ని సైబర్ నేరగాళ్లు మోసం చేయడానికి వాడుతున్నారు. నకిలీ రిక్వెస్ట్లు పంపి, అత్యవసరం అంటూ చెప్పి, యూజర్లను తప్పుదోవ పట్టిస్తున్నారు. దాంతో వారు అనుమానించకుండా UPI పిన్ ఎంటర్ చేసి డబ్బు పోగొట్టుకుంటున్నారు.

రెండు వేల రూపాయల లిమిట్తోనే సరిపోలేదు
ఇంతకు ముందు NPCI ఈ ఫీచర్కు రూ. 2,000 పరిమితిని విధించింది. కానీ మోసాలు ఆగలేదు. అందుకే ఇప్పుడు ఈ ఫీచర్ను పూర్తిగా తొలగించాల్సిన అవసరం ఏర్పడింది. జూలై 29న విడుదల చేసిన సర్క్యులర్లో ఇది స్పష్టంగా పేర్కొన్నారు.కలెక్ట్ రిక్వెస్ట్ ఆప్షన్ తీసివేసిన తర్వాత, మీరు డబ్బులు పంపాలంటే సింపుల్. అవతలి వ్యక్తి నంబర్ ఎంచుకోండి. లేకుంటే వారి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయండి. అప్పుడు మాత్రమే మీరు సురక్షితంగా డబ్బు పంపగలుగుతారు. ఇదే భద్రతకు అనువైన మార్గమని NPCI చెబుతోంది.
వాపార లావాదేవీలకు మాత్రం మినహాయింపు
ఇది వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. ఆన్లైన్ సంస్థలు – ఫ్లిప్కార్ట్, అమెజాన్, స్విగ్గీ వంటి కంపెనీలు మాత్రం కలెక్ట్ రిక్వెస్ట్ ఫీచర్ను కొనసాగించవచ్చు. వారు చెల్లింపుల కోసం రిక్వెస్ట్ పంపితే, యూజర్లు UPI పిన్ ఎంటర్ చేసి పేమెంట్ పూర్తిచేయవచ్చు. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు.ఎప్పుడైనా మీకు తెలిసిన వ్యక్తి కాకుండా డబ్బు అడిగితే జాగ్రత్త. వెంటనే ఆ రిక్వెస్ట్ను తిరస్కరించండి. అపరిచిత రిక్వెస్ట్లను క్లిక్ చేయకండి. యూపీఐ పిన్ ఎప్పుడూ గోప్యంగా ఉంచండి.UPI లావాదేవీలు భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాయి. కానీ, భద్రత కూడా అంతే అవసరం. NPCI తీసుకున్న ఈ నిర్ణయం వినియోగదారుల డబ్బును కాపాడే దిశగా ముందడుగు. మీరు కూడా ఈ మార్పులకు సిద్ధంగా ఉండండి.
Read Also :