ఆర్థిక పరిపాలనలో కీలకమైన ద్రవ్య విధాన సమీక్షలు ప్రతిసారీ పెట్టుబడిదారులు, బ్యాంకింగ్ రంగం, పారిశ్రామికవేత్తలు, మరియు సామాన్య ప్రజల దృష్టిని ఆకర్షిస్తుంటాయి. తాజాగా జూన్ 6న జరగనున్న ద్రవ్య విధాన సమీక్ష సమావేశంపై భారీ ఆసక్తి నెలకొంది. గతంలో రెపో రేటును 25 బేసిక్ పాయింట్లు తగ్గించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), మరోసారి భారీగా కోత పెట్టే అవకాశాలున్నాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఈ నెల 6న ద్రవ్య విధాన సమావేశం జరగనున్న నేపథ్యంలో రెపో రేటు 50 శాతం బేసిక్ పాయింట్లు తగ్గించే అవకాశం ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తాజా నివేదికలో వెల్లడించింది. ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేందుకు వ్యూహాత్మక ప్రయత్నంగా ఆర్బీఐ ఈ చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నారు.
మిగులు లిక్విడిటీ పరిస్థితి
ఎస్బీఐ గ్రూప్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సౌమ్యకాంతి ఘోష్ (Soumyakanti Ghosh) వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రస్తుతం బ్యాంకింగ్ వ్యవస్థ మిగులు లిక్విడిటీతో నిండిపోయిన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇటీవల ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో ఆర్థిక సంస్థల సేవింగ్స్ ఖాతా వడ్డీ రేట్లను 2.70 శాతానికి తగ్గించాయి. 2025 ఫిబ్రవరి నుంచి ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు 30 -70 బేసిక్ పాయింట్లు తగ్గాయి. దాంతో బ్యాంకుల వద్ద లిక్విడిటీ పెరుగుతోంది. దీన్ని అప్పులు ఇచ్చేందుకు అవకాశంగా మలుచుకుంటున్నాయి.
జూన్ పాలసీలో కీలక నిర్ణయం?
జూన్ పాలసీ సమావేశంలో 50 బేసిక్ పాయింట్ల రేటు కోత ఉంటుందని భావిస్తున్నామని ఎస్బీఐ వెల్లడించింది. ఈ ఏడాది చివరి నాటికి మొత్తం రేటు తగ్గింపు వంద బేసిక్ పాయింట్లకు చేరుకోవచ్చని అంచనా వేసింది. ద్రవ్యోల్బణం గణాంకాలు ఆర్బీఐ నిబంధనల మేరకే ఉన్నాయని తెలిపింది. బ్యాంకులు తమ వద్ద లభ్యమైన లిక్విడిటీని వినియోగించుకునేందుకు రెపో రేటు తగ్గింపు ఉపయుక్తంగా మారుతుంది. రెపో రేటు అనేది ఆర్బీఐ నుండి బ్యాంకులు అప్పు తీసుకునే రేటు. దీన్ని తగ్గించడం వల్ల బ్యాంకులు తక్కువ వడ్డీకి నిధులు పొందగలవు, తద్వారా వాటిని రుణాల రూపంలో ప్రజలకు అందించవచ్చు.
Read also: Stock Markets: నష్టాల్లో బయటపడలేకపోతున్న స్టాక్ మార్కెట్లు