ఈ రోజుల్లో ఏది చేయాలన్నా సిబిల్ స్కోర్ (CIBIL Score) చూస్తున్నారు. రుణం కావాలా? స్కోర్ చూడాల్సిందే. క్రెడిట్ కార్డ్ కోసం అప్లై చేశారా? మొదట స్కోర్ చెక్. తీరా కొన్ని కంపెనీలు ఉద్యోగానికి సైతం ఇదే ఆధారం. ఇప్పుడు ఈ స్కోర్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చ మొదలైంది.సిబిల్ స్కోర్ విషయంలో వినియోగదారుల అసంతృప్తి అసాధారణంగా పెరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సిబిల్కు 22,94,855 ఫిర్యాదులు వచ్చినట్లు సంస్థ ప్రకటించింది. ఇందులో 5.8 లక్షల ఫిర్యాదులు సంస్థాగత పొరపాట్లు కారణంగా వచ్చినవే కావడం గమనార్హం. అంటే వినియోగదారుల తప్పు కాకుండానే స్కోర్ పడిపోతున్న విషయాలు వెలుగులోకి వచ్చాయి.
సిబిల్ స్కోర్ వల్ల ఉద్యోగమే పోయింది
తాజాగా మద్రాస్ హైకోర్టు (Madras High Court) ఇచ్చిన తీర్పు మరింత దుమారం రేపింది. ఎస్బీఐలో ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థిని, సిబిల్ రిపోర్టు ప్రతికూలంగా ఉండటంతో నియమించలేదు. దీనిపై అభ్యర్థి కోర్టుకు వెళ్లగా, కోర్టు బ్యాంకు వైఖరిని సమర్థించింది. ఆర్థిక నిర్వహణ సరిగా లేని వ్యక్తి, ఇతరుల డబ్బును ఎలా భద్రంగా చూసుకుంటాడని ప్రశ్నించింది.సిబిల్ సంస్థ “ట్రాన్స్యూనియన్” అనే ప్రైవేట్ సంస్థ నిర్వహిస్తోంది. కానీ ఈ సంస్థ క్రెడిట్ స్కోర్ అప్డేట్స్ పారదర్శకంగా చేస్తుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తమిళనాడు ఎంపీ కార్తి చిదంబరం, ఇటీవల లోక్సభలో మాట్లాడుతూ, “ఇది పూర్తిగా పారదర్శకత లేని వ్యవస్థ” అన్నారు. తప్పులపై వినియోగదారులు ఫిర్యాదు చేయడానికి సరైన మార్గం లేకపోవడం ప్రజలతో పాటు ఎంపీలలోనూ ఆందోళన కలిగిస్తోంది.
గూగుల్ పేలో స్కోర్ చూసారంటే… స్పామ్ కాల్స్ వెంటనే!
ఇదిలా ఉంటే, సిబిల్ స్కోర్ తెలుసుకునేందుకు గూగుల్ పే, పైసాబజార్, బజాజ్ వంటి యాప్లను వినియోగదారులు ఉపయోగిస్తున్న తర్వాత వారి ఫోన్కు స్పామ్ కాల్స్ వెల్లువెత్తుతున్నాయని అనేక మంది ఆరోపిస్తున్నారు. “స్కోర్ చూశానన్న ఒకటే కారణంతో పదే పదే లోన్ కాల్స్ వస్తున్నాయి,” అని వాపోతున్నారు.ఈ పరిస్థితుల మధ్య కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తొలిసారి రుణం తీసుకునే వారి దరఖాస్తులను కేవలం స్కోర్ లేదని తిరస్కరించొద్దని బ్యాంకులకు సూచించింది. “క్రెడిట్ హిస్టరీ లేని వారికి కూడా అవకాశం ఇవ్వాలి,” అని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంటులో చెప్పారు. రిజర్వ్ బ్యాంక్ ఇప్పటికే ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిపారు.
Read Also :