బ్రిటన్(London) కు చెందిన టాటా గ్రూప్ అనుబంధ విలాస వాహన తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR), భారత్లో తన వ్యాపారాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే 3-4 సంవత్సరాల్లో కార్ల అమ్మకాల పరంగా, ఆదాయ పరంగా దూసుకెళ్లాలని సంస్థ సంకల్పించింది. ఇందుకోసం కారు మోడళ్లతో పాటు సేల్స్ నెట్వర్క్ను విస్తరించాలనుకుంటున్నట్లు జేఎల్ఆర్ (JLR) ఇండియా ఎండీ రాజన్ అంబా (Rajan amba) తెలిపారు. కొనుగోలుదార్ల అభిరుచికి అనుగుణంగా రూపొందించే కారు మోడళ్లకు గిరాకీ బాగుంటున్నందున, భారత్లో అలాంటి ఉత్పత్తులను పరిచయం చేయాలనుకుంటున్నట్లు రాజన్ (Rajan amba) తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా తమ కార్లు అధికంగా విక్రయించే 10 దేశాల జాబితాలో భారత్ను చేర్చాలనేది లక్ష్యమన్నారు. 2024-25లో సంస్థ భారత్లో 6,183 కార్లను విక్రయించింది. 2023-24తో పోలిస్తే ఇవి 40% అధికం. డీలర్లకు వాహన సరఫరాలు 39% పెరిగి 6,266కు చేరాయి. దేశంలో ఏడాదికి 8,000 కార్లను విక్రయించేందుకు అవకాశాలున్నాయని తెలిపారు. వచ్చే 3-4 ఏళ్లలో దేశీయంగా కార్ల సంఖ్య, ఆదాయ పరంగా వ్యాపారాన్ని రెట్టింపు చేస్తామనే ధీమా వ్యక్తం చేశారు.ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 21 నగరాల్లో 25 అధీకృత విక్రయశాలలుండగా, 2030 నాటికి 50కి చేరుస్తామని రాజన్ తెలిపారు. రాజ్కోట్, గోవా, నాగ్పుర్ వంటి ప్రాంతాల్లో కొత్త డీలర్షిప్లు వస్తాయన్నారు. రేంజ్ రోవర్ బీఈవీ సహా మరిన్ని మోడళ్లను తీసుకురావడానికి పెట్టుబడులు పెడతామని వివరించారు. జపాన్కు చెందిన హోండా మోటార్, విద్యుత్తు వాహనాల విక్రయాలు అమెరికాలో నెమ్మదించడాన్ని దృష్టిలో ఉంచుకుని, తన వ్యూహంలో మార్పులు చేసింది. విద్యుత్తు వాహనాల కంటే హైబ్రిడ్ మోడళ్లపై దృష్టి పెట్టాలని నిర్ణయించింది.
హోండా ఈవీల నుంచి హైబ్రిడ్లవైపు మలుపు
అమెరికాలో విద్యుత్ వాహన (ఈవీ) విక్రయాలు నెమ్మదించినందున, జపాన్ వాహన దిగ్గజం హోండా తన ఈవీ వ్యూహాన్ని మార్చుకున్నట్లు మంగళవారం తెలిపింది. ఈవీలకు బదులుగా హైబ్రిడ్ మోడళ్ల ఉత్పత్తి పెంచాలని నిర్ణయం తీసుకుంది. 2030 నాటికి అంతర్జాతీయంగా తమ వాహన విక్రయాల్లో ఈవీల వాటా 30% ఉండాలనే లక్ష్యాన్ని సంస్థ రద్దు చేసుకుంది. విద్యుదీకరణ వ్యూహంలో భాగంగా 2030-31 ఆర్థిక సంవత్సరం నాటికి 10 ట్రిలియన్ యెన్ల (69 బిలియన్ డాలర్ల-సుమారు రూ.5.86 లక్షల కోట్ల) పెట్టుబడి ప్రణాళికను, 3 ట్రి.యెన్ల (21 బి.డాలర్ల-రూ.1.78 లక్షల కోట్ల) మేర తగ్గించి, 7 ట్రి.యెన్ల (48 బి.డాలర్ల-రూ.4.08 లక్షల కోట్ల)కు పరిమితం చేసింది. హోండా మోటార్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ తోషిహిరో మిబే ఈ నిర్ణయాలను ప్రణాళికాబద్ధమైన మార్పుగా అభివర్ణించారు.
Read Also: Stock market: లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు