భారతీయ పారిశ్రామిక దిగ్గజం అదానీ గ్రూప్ రక్షణ మరియు విమానయాన రంగంలో మరో భారీ అడుగు వేసింది. ఇటలీకి చెందిన ప్రపంచ ప్రఖ్యాత హెలికాప్టర్ల తయారీ సంస్థ లియోనార్డో (Leonardo) తో అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా అదానీ గ్రూప్ అధికారికంగా హెలికాప్టర్ల తయారీ రంగంలోకి ప్రవేశించింది. దేశీయంగా అత్యాధునిక హెలికాప్టర్ల తయారీ ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేయడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించడం ఈ ఒప్పందం యొక్క ప్రధాన ఉద్దేశం.
Mumbai Airport : ముంబై ఎయిర్పోర్టులో తప్పిన పెను ప్రమాదం
ఈ ఒప్పందం ముఖ్యంగా భారత సైన్యం (Army) మరియు వైమానిక దళం (Air Force) అవసరాలను తీర్చడమే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం భారత్ తన రక్షణ అవసరాల కోసం విదేశీ దిగుమతులపై ఆధారపడుతోంది. ‘మేక్ ఇన్ ఇండియా’ మరియు ‘ఆత్మనిర్భర్ భారత్’ పిలుపులో భాగంగా, అదానీ గ్రూప్ దేశీయంగానే హెలికాప్టర్ల అసెంబ్లీ, తయారీ మరియు నిర్వహణ (MRO) సదుపాయాలను కల్పించనుంది. లియోనార్డో సంస్థకు ఉన్న అంతర్జాతీయ అనుభవం, అదానీ గ్రూప్కు ఉన్న మౌలిక సదుపాయాల నెట్వర్క్ తోడైతే రక్షణ రంగంలో పెను మార్పులు వచ్చే అవకాశం ఉంది.

రక్షణ రంగ నిపుణుల విశ్లేషణ ప్రకారం, ఈ డీల్ వల్ల కేవలం హెలికాప్టర్ల తయారీ మాత్రమే కాకుండా, వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలకు (MSMEs) సప్లై చైన్ ద్వారా భారీగా ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది. అదానీ గ్రూప్ ఇప్పటికే డ్రోన్లు, క్షిపణి వ్యవస్థలు మరియు చిన్నపాటి ఆయుధాల తయారీలో కీలకంగా వ్యవహరిస్తోంది. ఇప్పుడు హెలికాప్టర్ల తయారీలోకి అడుగుపెట్టడం ద్వారా గ్లోబల్ డిఫెన్స్ మార్కెట్లో అదానీ గ్రూప్ తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోనుంది.