ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో నిలిచిపోయిన అమరావతి రాజధాని పనులు ఓవైపు తిరిగి ప్రారంభం అవుతుండగా.. మరోవైపు గత ప్రభుత్వంలో నిలిపేసిన పలు కనెక్టివిటీ రహదారుల పనులు కూడా వేగవంతం అవుతున్నాయి. అయితే ఇందులో కేంద్రం కాసుల కక్కుర్తితో అమరావతికి ఓ షాక్ ఇచ్చేందుకు సిద్దమవుతోంది. ఇందులో భాగంగా రాష్ట్రానికి గతంలో మంజూరు చేసిన ఓ కీలక హైవేలో కోత పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది.
నిజాం పట్నంలో ఫిషింగ్ హార్బర్ కు జాతీయ రహదారి కనెక్టివిటీ కల్పించేందుకు గతంలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ప్లాన్ సిద్దం చేసింది. అయితే నిజాంపట్నం నుంచి గుంటూరులోని బుడంపాడు వద్ద ఉన్న కోల్ కతా-చెన్నై జాతీయ రహదారి వరకూ మొత్తం 53 కిలోమీటర్ల మేర జాతీయ రహదారిని నిర్మించాల్సి ఉంది. దీనికి గతంలో అంగీకరించిన జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఇప్పుడు రూటు మారుస్తోంది. ఈ రహదారి మధ్యలో వస్తున్న మరో జాతీయ రహదారి కత్తిపూడి-ఒంగోలు రూట్ కు కలిపేందుకు సిద్దం చేస్తోంది. ఇలా చేస్తే అమరావతితో పాటు మధ్యలో ఉన్న పొన్నూరు, చేబ్రోలు, నారా కోడూరుకు షాక్ తప్పదు.ఇలా చేయడం వల్ల నిజాపట్నం హార్బర్ నుంచి కేవలం 18 కిలోమీటర్ల దూరంలో చందోలు వద్ద ఉన్న ఒంగోలు-కత్తిపూడి హైవే లింక్ అవుతుంది. అలాగే జాతీయ రహదారుల ప్రాధికార సంస్ధకు భారీగా ఖర్చు మిగులుతుంది. అయితే అమరావతి రాజధానికి నిజాంపట్నం హార్బర్ కనెక్టివిటీ లేకుండా పోతోంది. అయితే ఈ రెండు ప్లాన్లను రెడీ చేయించిన ఎన్ హెచ్ ఏ ఐ త్వరలో దీనిపై కీలక నిర్ణయం తీసుకోబోతోంది. ఇందులో అమరావతి రాజధానికి కనెక్టివిటీ ఉండే రూటును ఎంచుకుంటే భారీగా భూసేకరణ, ఇతర ఖర్చులు తప్పవు.