ఝార్ఖండ్‌లో కొనసాగుతున్న తొలివిడత పోలింగ్..

Read Time:  1 min
first phase of polling is going on in Jharkhand
first phase of polling is going on in Jharkhand
FONT SIZE
GET APP

న్యూఢిల్లీ: ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడుత పోలింగ్‌ కొనసాగుతుంది. బుధవారం ఉదయం 7గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. మొత్తం 15 జిల్లాల్లోని 43 నియోజకవర్గాల్లో ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. 1.37లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ తొలి విడత ఎన్నికల్లో 683 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్ కోసం 15,344 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేయగా.. పోలీస్ శాఖ పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. తొలి విడతలో ప్రధాన అభ్యర్థుల్లో మాజీ సీఎం చంపయీ సోరెన్, కాంగ్రెస్ నేత బన్నా గుప్తా, రాజ్యసభ సభ్యుడు మహువా మాఝీ, మాజీ సీఎం మధు కోడా సతీమణి గీతా కోడా, మాజీసీఎం రఘబర్ దాస్ కోడలు పూర్ణిమా దాస్ ఉన్నారు. ఇదిలాఉంటే.. ఉదయం నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.

కాగా, రాంచీలోని పోలింగ్‌ కేంద్రంలో ఝార్ఖండ్ గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, అధిక సంఖ్యలో ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. రాంచీ పోలింగ్ స్టేషన్ 16లో ఓ మహిళ సాంప్రదాయ డోలు వాయిస్తూ ఓటు వేయాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఝార్ఖండ్ ఎన్నికల సందర్భంగా.. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సోషల్ మీడియా పోస్టు చేశారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని బలోపేతం చేయడానికి, బలపర్చడానికి ఓటర్లు తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకోవాలని ఖర్గే కోరారు.

ప్రస్తుతం ఝార్ఖండ్ లో ఝార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఉంది. హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఈసారి మళ్లీ అధికారాన్ని కైవసం చేసుకునేందుకు జేఎంఎం ప్రయత్నిస్తుండగా.. ఈసారి ఝార్ఖండ్ రాష్ట్రంలో పాగా వేయాలని బీజేపీ ప్రయత్నిస్తుంది.

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.