ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఎల్లుండికి వాయిదా..

Read Time:  1 min
AP Assembly Sessions Postponed to Wednesday
AP Assembly Sessions Postponed to Wednesday
FONT SIZE
GET APP

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడింది. మొదటి రోజు బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం వెంటనే వాయిదా పడ్డాయి. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2024-2025 సంవత్సరాలకు గాను రూ.2.94 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్ ను సభలో ప్రవేశ పెట్టారు. అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు రూ. 43,402 కోట్ల బడ్జెట్ ను అసెంబ్లీలోనే ప్రవేశ పెట్టి, ఎన్డీయే ప్రభుత్వం.. రైతులకు, వ్యవసాయానికి పెద్దపీట వేసిందని చెప్పుకొచ్చారు. అనంతరం అసెంబ్లీ సమావేశాలను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. కాగా రేపు ఏపీ అసెంబ్లీకి సెలవు ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి కూటమి శాసనసభాపక్ష సమావేశం కానున్నారు.

ఇకపోతే ఈ సందర్భంగా స్పీకర్‌ మాట్లాడుతూ.. బడ్జెట్‌ సందర్భంగా సభ్యులందరికీ ప్రత్యేకంగా భోజనాలు ఉన్నాయని, అందరూ భోజనం చేసి వెళ్లాలని సభ్యులందరికీ సూచించారు. కాగా, బడ్జెట్‌ సమావేశాలు కావడం వల్ల బడ్జెట్‌పై పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకొని చర్చించేందుకు సాధారణంగా ఒక రోజు సమయం ఇస్తారు. అందులో భాగంగానే మంగళవారం సమావేశాలు జరగడం లేదు. బుధవారం నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి.

కాగా, 2024 – 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం రూ.2,94,427.25 కోట్లతో బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ తన తొలి బడ్జెట్‌ను ప్రజల ముందుకు తీసుకొచ్చారు. ఇందులో రెవెన్యూ వ్యయం అంచనా రూ.2,35,916.99 కోట్లు కాగా.. మూలధన వ్యయం అంచనా రూ.32,712.84 కోట్లు. రెవెన్యూ లోటు రూ.34,743.38 కోట్లుగా అంచనా వేశారు. ద్రవ్య లోటు రూ.68,742.65 కోట్లు ప్రతిపాదించారు. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి (జి.ఎస్.డి.పి.)లో రెవెన్యూ లోటు 4.19 శాతంగానూ ద్రవ్యలోటు 2.12 శాతంగానూ ఉండవచ్చని అంచనా కట్టారు. యువజన, పర్యాటక, సాంస్కృతిక శాఖ- రూ. 322 కోట్ల, పోలీసు శాఖ- రూ. 8,495 కోట్లు, పర్యావరణ, అటవీ, శాస్త్ర, సాంకేతిక శాఖ – రూ. 687 కోట్లు, రవాణా, రోడ్లు, భవనాల శాఖ- రూ. 9,554 కోట్లు, ఇంధన శాఖ – రూ. 8,207 కోట్లు, పరిశ్రమలు, వాణిజ్య శాఖ- రూ. 3,127 కోట్లు కేటాయించారు. ఇంకా వివిధ రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ కేటాయింపులు చేశారు.

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమైన సంగతి తెలిసిందే . సమావేశాలు ప్రారంభానికి ముందు సీఎం చంద్రబాబు వెంకట పాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. వెలగపూడిలో అసెంబ్లీ నిర్మించినప్పటి నుంచి వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించడం చంద్రబాబు కు ఆనవాయితీ. సమావేశాలు ప్రారంభం కాగానే.. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జె‌ను ప్రవేశ పెట్టారు. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి రూ.2.94లక్షల కోట్లతో పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్‌ ప్రవేశ పెట్టడం జరిగింది. ఈసారి రాష్ట్ర బడ్జెట్ సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చే దిశగా ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు. సంక్షేమం, అభివృద్ధికి బడ్జెట్ లో పెద్దపీట వేసినట్లు పేర్కొంటున్నారు.

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.