అధికారుల మీద దాడి..మనమీద మనం దాడి చేసుకునట్లే: మంత్రి పొంగులేటి

Read Time:  1 min
Minister ponguleti srinivasa reddy
Minister ponguleti srinivasa reddy
FONT SIZE
GET APP

హైదరాబాద్‌ : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు గాంధీభవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వికారాబాద్‌ ఘటనపై మరోసారి మాట్లాడుతూ..బీఆర్‌ఎస్‌ నేతలపై మండిపడ్డారు. వికారాబాద్ జిల్లాకు ఫస్ట్ మేజిస్ట్రేట్‌గా ఉన్న కలెక్టర్‌పైనే హత్యాయత్నం చేయడానికి కుట్ర పన్నారని ఆరోపించారు. అధికారుల మీద దాడి జరగడం మనమీద మనం దాడి చేసుకునట్లేనని అన్నారు. రైతుల ముసుగులో కొంతమంది గులాబీ గూండాలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు చేశారు. కుట్రపూరితంగా అధికారులను రైతులకు దూరం చేసే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారని మండిపడ్డారు. గులాబీ గూండాల కుట్రలను రైతాంగం అర్ధం చేసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

ప్రజలను కాపాడుకున్నట్లే, అధికారులను కాపాడుకోలేకపోతే పని చేయడానికి ఏ అధికారి ముందుకు వస్తారని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కూడా ఇదే పద్ధతి పాటించారా అని నిలదీశారు. ఏం తప్పుచేశారని ఆనాడు ఖమ్మంలో మిర్చి రైతులకు సంకెళ్లు వేసి జైల్లో పెట్టారని ప్రశ్నించారు. మల్లన్నసాగర్‌లో రైతులను దేశద్రోహులుగా చిత్రీకరించారని ఆరోపించారు. పిల్లా, పాపా, ముసలి అనే తేడా లేకుండా రాత్రికి రాత్రి వారిని అరెస్ట్ చేసి సంకెళ్లు వేసిన సంగతి మరిచారా అని ప్రశ్నించారు. కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లలో దళితులకు బేడీలు వేసిన సంగతి మరిచిపోయారా అని నిలదీశారు. లగచర్లలో ఆ పరిస్ధితి లేదు కదా అని మంత్ర పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు.

కాగా, రైతులను నష్టపెట్టాలన్నది తమ ప్రభుత్వ ఉద్దేశం కాదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. వారి సమస్యలను వినడానికి, పరిష్కరించడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని తెలిపారు. రైతుల ముసుగులో అధికారులను చంపే ప్రయత్నం చేయడం మంచి పద్ధతి కాదని అన్నారు. లగచర్ల సంఘటను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటుందని అన్నారు. ఈ రోజు అధికారులపై దాడి జరిగినట్లుగానే ..రేపు రాజకీయ నాయకులు, ప్రజలపై దాడి జరిగితే ప్రభుత్వం ఉపేక్షించదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు.

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.