హైదరాబాద్: మాజీ మంత్రి,బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి స్పీకర్ మీద సీరియస్ అవ్వడమే కాకుండా.. క్లారిఫికేషన్ కోసం టైం ఇచ్చినా.. తన తప్పు ఒప్పుకుని సారీ చెప్పకుండా నేను ఏం తప్పు మాట్లిడినా అని అనడం సరికాదని.. అందుకే స్పీకర్ చర్యలు తీసుకున్నారని వివరించారు.
అప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా?
అంతేకాకుండా తాను, సీతక్క సభలో పక్కపక్కనే కూర్చుంటే బీఆర్ఎస్ శ్రేణులు ఫొటోలు తీశారని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని.. 32 మెడికల్ కాలేజీలకు బదులు 32 వాట్సాప్ యూనివర్సిటీలు పెట్టేదుండే అని కేటీఆర్ అన్నారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న నాడు శాసన మండలి చైర్మన్ పై కాగితాలు పడేశారని తమ పార్టీకి చెందిన సభ్యులను సస్పెండ్ చేస్తే అప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అని గులాబీ పార్టీ నేతలపై మంత్రి పొన్నం ప్రభాకర్ సెటైర్లు వేశారు.
నిరసనకు దిగడం హస్యాస్పదం
ప్రజాస్వామ్యాన్ని కాలరాసిన వాళ్లే జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ అప్రజాస్వామికం అంటూ అసెంబ్లీ అవరణలో నిరసనకు దిగడం హస్యాస్పదమని అని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడే విషయంలో బీఆర్ఎస్ పార్టీ కి కనీస జ్ఞానం రావాలని అన్నారు. సభలో ఎలా ఉండాలో.. సభా వేదికపై ఎలా ప్రవర్తించాలో తెలిసి కూడా అలా చేస్తున్నారంటే.. వారిలో ఏదో దుర్భుద్ధి ఉందనేది స్పష్టం అర్థం అవుతోందని విషయాన్ని ప్రజలు గమనించాలని అన్నారు.