ఉత్తరాఖండ్లో చార్ ధామ్ యాత్ర మొదలుకాబోతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటివరకు ఈ యాత్ర కోసం 19.95 లక్షల మంది భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకోగా, ఇందులో 17 వేల మంది విదేశీ పర్యాటకులు కూడా ఉన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై, విదేశీ భక్తుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది.చార్ ధామ్ యాత్రకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. వీరికి భద్రతతో పాటు, యాత్ర సజావుగా సాగేందుకు ఏర్పాట్లను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. విదేశీ భక్తులకు గంగాహారతిలో పాల్గొనే అవకాశాలు కల్పించాలని, ఈ యాత్ర గురించి వారు తమ దేశాల్లో ఓ సానుకూల సందేశాన్ని తీసుకెళ్లేలా చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ క్రమంలో విదేశీ భక్తుల పట్ల మరింత శ్రద్ధ చూపించేందుకు నిర్ణయించబడింది.ఈ ఏడాది చార్ ధామ్ యాత్ర కోసం ఇప్పటి వరకు అమెరికా, యూకే, మలేసియా, నేపాల్, ఆస్ట్రేలియా తదితర 103 దేశాల నుంచి భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కేదార్నాథ్ ధామ్కు 6,100 మంది, బద్రీనాథ్కు 4,800, గంగోత్రికి 3,150, యమునోత్రికి 2,750 మంది విదేశీ పర్యాటకులు రిజిస్ట్రేషన్ చేశారు. మొత్తం 17,000కి పైగా విదేశీ భక్తులు చార్ ధామ్ యాత్ర కోసం సిద్ధమయ్యారు.

విదేశీ భక్తులకు ప్రత్యేక ఆకర్షణ – గంగా హారతి
ఇదే సమయంలో భారతీయ భక్తుల సంఖ్య కూడా భారీగానే ఉంది. కేదార్నాథ్కు 6,81,181 మంది, బద్రీనాథ్కు 6,01,278 మంది, గంగోత్రికి 3,54,649, యమునోత్రికి 3,23,551 మంది, హేమకుండ్ సాహిబ్కు 34,633 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.పర్యాటక శాఖ మంత్రి సత్వాల్ మహారాజ్ ప్రకారం, విదేశీ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. గంగా హారతి కార్యక్రమాలు హరిద్వార్, రిషికేశ్లలో నిర్వహించబడతాయి. ఈ ఏడాది విదేశీ భక్తులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం. రిషికేశ్లో గంగా హారతిలో వీరిని అనుమతించే అవకాశాలున్నాయి.ఇక భద్రత పరంగా కూడా అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. చమోలి జిల్లాలో ట్రాఫిక్ జామ్ సమస్యలు లేకుండా ఉండేందుకు జిల్లా మేజిస్ట్రేట్ సందీప్ తివారీ సూచనల మేరకు యుద్ధ ప్రాతిపదికన పనులు కొనసాగుతున్నాయి.గంగోత్రి, యమునోత్రి ధామ్లు ఏప్రిల్ 30న, కేదార్నాథ్ మే 2న, బద్రీనాథ్ మే 4న తెరవనున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల సంఖ్య, భద్రత, వసతులపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టుతోంది. జమ్ముకాశ్మీర్లో ఇటీవల జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలై, పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు తీసుకోవాలని న్యాయవాది విశాల్ తివారీ కేంద్ర హోం శాఖను కోరారు.
Read More : Suicide: పుట్టిన బిడ్డ పై అనుమానం.. తల్లి ఆత్మహత్య