తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) భక్తుల సౌకర్యం కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి అలిపిరిలోని సప్త గో ప్రదక్షిణ మందిరంలో ప్రతిరోజూ నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహం కార్యక్రమానికి సంబంధించి టికెట్లను ఇకపై పూర్తిగా ఆన్లైన్లో మాత్రమే అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది. ఈ మార్పు ఆగస్టు 1వ తేదీ నుండి అమలులోకి రానుంది. ప్రతిరోజూ కేవలం 200 టికెట్లు మాత్రమే జారీ చేయనున్నట్టు టీటీడీ వెల్లడించింది.
హోమంలో పాల్గొనదలచిన వారికి ప్రత్యేక దర్శన సదుపాయం
ఈ కార్యక్రమంలో పాల్గొనదలచిన గృహస్తులు ఒక్క టికెట్కు రూ.1600 చెల్లించి హోమంలో పాల్గొనవచ్చు. ఒక్కో టికెట్ ద్వారా ఇద్దరు గృహస్థులకు పాల్గొనడానికి అనుమతి ఉంటుంది. వీరికి అదనంగా రూ.300 విలువైన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ కూడా టీటీడీ అందించనుంది. ఇప్పటి వరకు ఈ టికెట్లలో 150 టికెట్లు ఆన్లైన్లో, 50 టికెట్లు కరెంట్ బుకింగ్ ద్వారా అందించేవారు. ఇకపై టికెట్ల జారీ పూర్తి స్థాయిలో ఆన్లైన్ పద్ధతిలో మాత్రమే కొనసాగనుంది. భక్తులు దీనిని గమనించి ముందుగానే టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
దళారుల ముఠాపై విజిలెన్స్ విభాగం దాడి
ఇక మరోవైపు, తిరుమలలో శ్రీవారి దర్శనానికి సంబంధించిన దళారుల ముఠా చలనం కలిగిస్తోంది. శ్రీవారి ఉచిత దర్శనాన్ని వెంటనే కల్పిస్తామని చెప్పి భక్తుల నుంచి ఒక్కొక్కరిపై రూ.1500 చొప్పున వసూలు చేసిన ముఠాను టీటీడీ విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. దాదాపు 25 మంది భక్తులు ఈ ముఠా వలలో పడి మోసపోయారు. భద్రతా సిబ్బందితో కుమ్మక్కై వీరికి నేరుగా దర్శనం కల్పించిన ఈ వ్యవహారంపై అధికారులు తీవ్రంగా స్పందించి, దళారులతో పాటు భద్రతా సిబ్బందిని కూడా అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. భక్తుల భద్రతే తమకు ప్రథమ కర్తవ్యమని టీటీడీ స్పష్టం చేసింది.
Read Also : OBC : ప్రైవేట్ విద్యాసంస్థల్లోనూ OBCలకు రిజర్వేషన్లు ఇవ్వాలి – రాహుల్