విదేశీ వస్తువులపై తాను విధించిన భారీ సుంకాలను (Tariffs) సుప్రీంకోర్టు అక్రమమని తేల్చడంపై డొనాల్డ్ ట్రంప్ నిప్పులు చెరిగారు. ఈ తీర్పును ఒక “అవమానం” (Disgrace) గా అభివర్ణించిన ఆయన, న్యాయమూర్తుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా తాను నియమించిన న్యాయమూర్తులు కూడా తనకు వ్యతిరేకంగా ఓటు వేయడంపై ఆయన తీవ్రంగా స్పందిస్తూ, వారికి దేశం పట్ల ప్రేమ లేదని, విదేశీ శక్తుల ప్రభావానికి లోనయ్యారని ఆరోపించారు. కోర్టు నిర్ణయం వల్ల అమెరికాను ఏళ్ల తరబడి దోచుకుంటున్న దేశాలు ఆనందంతో వీధుల్లో డాన్సులు చేస్తున్నాయని, కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవదని ఆయన హెచ్చరించారు.
BC Reservations: ప్రధానిపై రేవంత్ ఒత్తిడి తేవాలి: కవిత
న్యాయస్థానం తీర్పు ప్రకారం.. పన్నులు లేదా సుంకాలు విధించే అధికారం కేవలం ‘అమెరికా కాంగ్రెస్’కు మాత్రమే ఉంటుంది, అధ్యక్షుడికి లేదని స్పష్టం చేసింది. అయితే ట్రంప్ ఈ సాంకేతిక అంశాలను తోసిపుచ్చుతూ, తన వద్ద ఇంకా బలమైన మార్గాలు ఉన్నాయని ప్రకటించారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన కొద్ది గంటల్లోనే ఆయన తన ‘ప్లాన్-బి’ని అమలులోకి తెచ్చారు. 1974 నాటి వాణిజ్య చట్టంలోని ‘సెక్షన్ 122’ను ఉపయోగించి అన్ని దేశాల నుంచి వచ్చే దిగుమతులపై తక్షణమే 10 శాతం గ్లోబల్ టారిఫ్ విధిస్తున్నట్లు సంతకం చేశారు. ఇది తన ఆర్థిక అజెండా నుండి తాను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ప్రపంచానికి చాటిచెప్పినట్లయింది.
ఈ పరిణామం అమెరికాలో ఒక పెద్ద రాజ్యాంగ సంక్షోభానికి దారితీసేలా కనిపిస్తోంది. ఒకవైపు న్యాయస్థానం అధ్యక్షుడి అధికారాలకు కళ్లెం వేయాలని చూస్తుంటే, ట్రంప్ మాత్రం పాత చట్టాల్లోని లొసుగులను వెతుకుతూ తన పంతాన్ని నెగ్గించుకుంటున్నారు. ఫిబ్రవరి 24 నుంచి అమలులోకి రానున్న ఈ కొత్త సుంకాలు అంతర్జాతీయ వాణిజ్యంపై మళ్లీ అనిశ్చితిని సృష్టించాయి. “కోర్టు నిర్ణయం వల్ల నా అధికారాలు తగ్గలేదు, సగర్వంగా చెప్పాలంటే నా మార్గం మరింత సుగమం అయింది” అని ట్రంప్ వ్యాఖ్యానించడం చూస్తుంటే, రాబోయే రోజుల్లో అమెరికా మరిన్ని వాణిజ్య యుద్ధాలకు సిద్ధమవుతోందని స్పష్టమవుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com