ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu) సింగపూర్ పర్యటనలో భాగంగా అక్కడి వాణిజ్య శాఖ మంత్రి టాన్ సీ లాంగ్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విశాఖపట్నంలో జరగనున్న పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానం పంపించారు. ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ, డేటా సెంటర్లు, పోర్టులు, ట్రాన్స్మిషన్ కారిడార్లు వంటి కీలక రంగాల్లో సింగపూర్ కంపెనీల భాగస్వామ్యం అవసరమని సీఎం తెలిపారు. గతంలో వైసీపీ ప్రభుత్వం (YCP Govt) చేసిన తప్పులను సరిదిద్దేందుకే తాను స్వయంగా వచ్చానని చంద్రబాబు వెల్లడించారు.
ఈ సమావేశంలో చంద్రబాబు మానవ వనరులు, శాస్త్ర సాంకేతికం, వాణిజ్య రంగాల్లో సంయుక్త భాగస్వామ్యం అవసరమని సూచించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సింగపూర్ కంపెనీలు ఎదుర్కొన్న అనుభవాలు, వాటి పరిష్కారాలు చర్చించారు. రికార్డులపై సూటిగా స్పందిస్తూ, గతంలో జరిగిన పొరపాట్లు మళ్లీ జరగవని స్పష్టం చేశారు. సింగపూర్ టౌన్షిప్ నిర్మాణం, రాత్రిపూట రోడ్ల శుభ్రపరిచే చర్యల వంటి అంశాలను గుర్తు చేస్తూ, సింగపూర్ అభివృద్ధి నుంచి ఏపీకి ఎంతో నేర్చుకోవాల్సి ఉందని వ్యాఖ్యానించారు.
సింగపూర్ మంత్రి టాన్ సీ లాంగ్ స్పందిస్తూ.. గృహ నిర్మాణం, సబ్సీ కేబుల్స్ రంగాల్లో ఏపీతో కలిసి పనిచేయాలని ఆసక్తి ఉన్నట్టు తెలిపారు. గ్రీన్ ఎనర్జీ, గృహ నిర్మాణ రంగాల్లో ప్రపంచ బ్యాంకుతో కలిసి ఇప్పటికే సింగపూర్ పనిచేస్తోందని వివరించారు. అలాగే నవంబర్లో ఏపీలో జరగనున్న పెట్టుబడుల సదస్సుకు తప్పకుండా వస్తానని హామీ ఇచ్చారు. గతంలో హైదరాబాద్ పర్యటనలో చంద్రబాబుతో సమావేశమైన విషయాన్ని గుర్తుచేశారు.
ఈ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. సింగపూర్ పర్యటనలో ఏపీ ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, అంతర్జాతీయ నమ్మకాన్ని తిరిగి సంపాదించేందుకు ఉద్దేశించింది. గత పాలనలో జరిగిన పొరపాట్లను సరిచేసేందుకు, సింగపూర్ వంటి అభివృద్ధి చెందిన దేశాలతో మళ్లీ సంబంధాలు బలోపేతం చేసేందుకు ఈ పర్యటన కీలకంగా మారుతోంది.
Read Also : Viral Video : లండన్-గ్లాస్గో విమానంలో బాంబు పెట్టబోతున్నానంటూ ప్రయాణికుడి కలకలం..