బ్యాంక్ ఖాతాల్లో (Bank Accounts) నిర్దిష్ట మొత్తాన్ని నిల్వగా ఉంచే మినిమమ్ బ్యాలెన్స్ నిబంధన చాలాకాలంగా అనేక మంది ఖాతాదారులకు భారం అయ్యింది. ఈ నిబంధనను ఉల్లంఘించినట్లయితే, బ్యాంకులు జరిమానాలు విధించేవి. అయితే తాజాగా కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ నిబంధనను ఎత్తివేసేందుకు ముందుకొచ్చాయి. ఖాతాదారుల వాదనలు, ఆర్థిక ఇబ్బందులు, డిజిటల్ లావాదేవీల పెరుగుదల వంటి అంశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ బ్యాంకుల్లో మినిమమ్ బ్యాలెన్స్పై ఫైన్ లేదు
జులై 1వ తేదీ నుంచి కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)లు మినిమమ్ బ్యాలెన్స్ (Minimum Balance) నిబంధనపై ఫైన్ విధించకూడదని నిర్ణయం తీసుకున్నాయి. జులై 2వ తేదీ నుంచి బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB), జులై 7వ తేదీ నుంచి ఇండియన్ బ్యాంక్ కూడా ఇదే మార్గంలో పయనించనున్నాయి. ఈ బ్యాంకుల్లో సేవింగ్స్ అకౌంట్ ఉన్న ఖాతాదారులు ఇకపై కనీస బ్యాలెన్స్ ఉంచలేనప్పటికీ, అదనపు జరిమానాలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది చిన్నఖాతాదారులకు మరియు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఎంతో ఉపశమనం కలిగించనుంది.
ఇతర బ్యాంకులపై ఖాతాదారుల నుంచి ఒత్తిడి
దేశీయంగా అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్బీఐ (SBI) 2020లోనే మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనను ఎత్తివేసింది. ఇప్పుడు మరికొన్ని బ్యాంకులు అదే దారిలో నడుస్తుండటంతో, మిగతా బ్యాంకులపై ఖాతాదారుల ఒత్తిడి పెరుగుతోంది. ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంకులు ఇప్పటికీ ఈ నిబంధనను కొనసాగిస్తుండటంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిజిటల్ బ్యాంకింగ్, జీరో బ్యాలెన్స్ అకౌంట్ల యుగంలో ఇంకా మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనలను కొనసాగించడం సమంజసం కాదన్నది వారి అభిప్రాయం. కనుక దేశంలోని అన్ని బ్యాంకులు ఈ నిర్ణయాన్ని పరిగణనలోకి తీసుకుని ఖాతాదారులకు మరింత వినూత్నమైన సేవలను అందించాలన్నది అంచనా.
Read Also : Election Commission: రాష్ట్రంలో 13 పార్టీలకు ఈసీ షాక్